Adani Modi: అదానీ-హిండెన్ బర్గ్ ఎపిసోడ్ ప్రపంచ వ్యాప్తంగా కాక రేపుతోంది. అదానీవి డొల్ల లెక్కలంటూ, అంతా అప్పుల కుప్ప అంటూ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వడం.. స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు పేక మేడలా కుప్పకూలిపోవడం.. అదానీ వెనుక మోదీ ఉన్నాడంటూ సర్వత్రా విమర్శలు వస్తుండటం.. అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై లేటెస్ట్ గా అమెరికాకు చెందిన బిలియనీర్ జార్జ్ సోరోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జర్మనీ, మ్యూనిచ్ లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జార్జ్ సోరోస్ అదానీ-మోదీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయన్నారు. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడిందని.. మోదీ కూడా బలహీన పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారం భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోందని, దీనిపై ప్రధాని మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలపై విదేశీ మదుపర్లు అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు జార్జ్ సోరోస్.
“అదానీ వ్యవహారం భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోంది” అంటూ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘‘జార్జ్ సోరోస్ కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను దోచుకున్న ఆయనను ఆ దేశం ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. జార్జ్ సోరోస్కు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమవ్వాలి’’ అంటూ స్మృతి ఇరానీ మండిపడ్డారు.
అటు, జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ‘‘అదానీ వ్యవహారం భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా అనేది పూర్తిగా మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
సోరోస్ కామెంట్లు కలకలం రేపుతుండగా.. భారత పరిణామాలపై, మరీ ముఖ్యంగా అదానీ-మోదీ వ్యవహారంపై అగ్రరాజ్యాల ప్రముఖ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. జర్మనీలో జరిగిన ప్రపంచస్థాయి ఈవెంట్ లో.. అమెరికన్ బిలియనీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. అదానీ ఎపిసోడ్ వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ చూపిస్తోందని తెలుస్తోంది. ఇది రానున్నరోజుల్లో భారత్ లో విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అంటున్నారు.