War: ఉక్రెయిన్పై రష్యా వార్ కొనసాగుతూనే ఉంది. యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా ముగింపు మాత్రం కనిపించటం లేదు. రోజురోజుకు యుద్ధం భీకరంగా మారుతోంది. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సాయశక్తులా పోరాడుతోంది. ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకర్లు కావాలని ఉక్రెయిన్ ప్రపంచదేశాలను కోరుతోంది.
ఈక్రమంలో ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకర్లు అందించేందుకు అమెరికా, జర్మనీ దేశాలు ముందుకొచ్చాయి. ఈ రెండు దేశాలు ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకర్లు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపించాలని అమెరికా, 14 లియోపార్డ్ 2 ట్యాంక్లను పంపించాలని జర్మనీ దేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ ట్యాంకులు ఉక్రెయిన్కు చేరితే యుద్ధం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.
ఈ యుద్ధ ట్యాంకర్లు తమ చేతికి రావడం వల్ల రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ భూభాగాన్ని మళ్లీ చేజిక్కించుకోవచ్చని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. కానీ రష్యా మాత్రం అమెరికా, జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకర్లు పంపించడం అంటే యుద్ధాన్ని రెచ్చగొట్టడమే అని రష్యా పేర్కొంది.