USA: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లపై ఇండియా.. ది మోదీ క్వశ్చన్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించింది. ఆ డాక్యుమెంటరీలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, చూసే వారిని తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా దీనిపై స్పందిస్తూ.. అందులోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించలేనని తెలిపారు.
ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. ‘‘ఈ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. భారత ప్రజాస్వామ్యం అత్యంత శక్తివంతమైనది. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి’’ అని అన్నారు.
ఇటీవల దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రచార కార్యక్రమం అని, వారు ఎంచుకున్న కోణాన్ని మాత్రమే ప్రచారం చేయడానికి దీన్ని రూపొందించారని అన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్య్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్లైన్ పిటిషన్ కూడా దాఖలైంది.