Amazon : అయోధ్య ఆలయంలో రాముడి ప్రతిష్ఠ జరుగుతున్న వేళ.. ప్రపంచపు అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అయోధ్య ప్రసాదం పేరుతో అభాసుపాలైంది. గుండు పిన్ను నుంచి భారీ ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నీ ఆన్లైన్లో అమ్మే ఈ సంస్థ.. అయోధ్య పేరుతో కస్టమర్లకు నకిలీ ప్రసాదం అమ్మకాలు మొదలు పెట్టి, ప్లాన్ రివర్స్ కావటంతో క్షమాపణలు కోరుతోంది.
ఈ సంస్థ అయోధ్య ప్రసాదం పేరుతో పాలకోవాను ఆన్లైన్ ఉంచింది. చాలామంది భక్తులు దీని కొనుగోలుకై భారీగా ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. అయితే.. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ జరగకుండానే ప్రసాదాలు అమ్మటమేంటనే చర్చ నెట్లో ప్రారంభం కావటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్కు కూడా కేంద్రం ఫిర్యాదు చేసింది. దీంతో సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తరఫున అధికారులు అమెజాన్కు నోటీసులు జారీ చేశారు.
మామూలు పాలకోవా(దూద్పేడా)ను అయోధ్య లడ్డూ అంటూ ఆన్లైన్లో ఎందుకు పెట్టారో వివరణ ఇవ్వాలని సెంట్రల్ కన్సూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ తన నోటీసులో పేర్కొంది. ఈ అనైతిక వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక.. అమెజాన్తో బాటు పలు ఈ కామర్స్ కంపెనీలు అయోధ్య ప్రసాదం, విభూది, హారం, అక్షింతలు అంటూ ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టాయి. అయితే.. ఇంకా ఆలయంలో రామయ్య కొలువుదీరనే లేదనీ, తాము అధికారికంగా ఎలాంటి ప్రసాదాలనూ అమ్మటం లేదని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయం గమనించాలని ట్రస్టు కోరుతోంది.