Google: మాంద్యం దెబ్బకు టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల 12 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఓ దంపతులకు ఒకేసారి ఉద్వాసన పలికిన గూగుల్.. ఓ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తుండగానే లేఆఫ్ సందేశం పంపించి షాక్ ఇచ్చింది. ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో గూగుల్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులను తొలగించే బదులు, సీఈవోగా ఆయన జీతంలో కోత విధించుకోవచ్చుగా అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన జీతంతో పాటు సీనియర్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్ను తగ్గించడంతో పాటు.. ఇకపై సీనియర్ ఉద్యోగులకు పని తీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఇవ్వనున్నారట. అయితే వారి జీతం ఎంత మేర తగ్గుతుందనే విషయం తెలియాల్సి ఉంది.