Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, గుజ్రాన్వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్దాన్ వీధులు.. ఇమ్రాన్ మద్దతుదారులతో కిక్కిరిసిపోయాయి. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగారు. రోడ్లపై బ్యానర్లు, టైర్లు తగలబెట్టి బ్లాక్ చేశారు. ఆందోళనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రధాన గేటును విరగొట్టారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాహోర్లో కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టారు.
మద్దతుదారులంతా ఇస్లామాబాద్ కు తరలి రావాలని.. ఇమ్రాన్ ను రిలీజ్ చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని PTI పార్టీ పిలుపునిచ్చింది.
మొబైల్ డేటా సర్వీసులపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాపై కూడా అప్రకటిత నిషేధం కొనసాగుతోంది.
ప్రస్తుతం ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ అమలవుతోంది. అయితే పోలీసుల ఆజ్ఞలను PTI నేతలు లెక్కచేయడం లేదు. దేశం మొత్తం ఆందోళనలు విస్తరిస్తున్నాయి. ఆందోళనల్లో పలువురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ న్యాయబద్ధంగానే జరిగిందని ఇస్లామాబాద్ హైకోర్టు తెలిపింది.
పాక్ లోని పరిస్థితులపై అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాక్ లో తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశాయి.