Christmas Tree : క్రిస్మస్ సందర్భంగా న్యూయార్క్లో నెలకొనే సందడే వేరు. వీధుల్లో ఎక్కడ చూసినా కోలాహలమే. మిడ్టౌన్ మాన్హటన్లోని రాక్ఫెల్లర్ సెంటర్ గురించి చెప్పనక్కర్లేదు. ఏటా అక్కడ ఏర్పాటు చేసే భారీ క్రిస్మస్ ట్రీ ఓ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.
రాక్ఫెల్లర్ సెంటర్ అనేది ఓ భారీ వాణిజ్య సముదాయ కూడలి. 22 ఎకరాల్లో విస్తరించిన ఈ సెంటర్లో 19 వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసి.. విద్యుద్దీపాలతో అలంకరించే సంప్రదాయం 1933 నుంచి కొనసాగుతోంది. క్రిస్మస్ ట్రీ వెలుగులతో సెలవుల సంరంభం ఆరంభమైనట్టు లెక్క.
తొలిసారిగా 1931లో ఇది మొదలైనా.. ఆ తర్వాత రెండేళ్లకు హాలిడే లైటింగ్ అధికారికంగా ఆరంభమైంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అయితే గత 90 ఏళ్లలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ భారీ వృక్షం నీడన ఐస్ స్కేటింగ్ రింక్ను 1936లో ప్రవేశపెట్టారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత క్రిస్మస్ ట్రీకి వెలుగులు కరువయ్యాయి. సెప్టెంబర్ 11 దాడుల దరిమిలా ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో మాత్రమే దీనిని డెకరేట్ చేశారు. 2007లో ఎల్ఈడీ లైట్లు రంగంలోకి వచ్చాయి. క్రిస్మస్ ట్రీని లైట్లతో అలంకరించే కార్యక్రమాన్ని 1997 నుంచి ఎన్బీసీ టీవీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఇక్కడ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడమనేది ఓ బృహత్తర కార్యక్రమం. పండుగకు ఎన్నో నెలలు ముందుగానే ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. కనీసం 75 అడుగుల ఎత్తు, 45 అడుగుల వ్యాసం ఉన్న క్రిస్మస్ ట్రీని పౌరులెవరైనా సూచించవచ్చు. దీని ఎంపిక, సంరక్షణ, రవాణా బాధ్యతలన్నీ రాక్ ఫెల్లర్ సెంటర్ హెడ్ గార్డెనరే స్వయంగా పర్యవేక్షిస్తాడు.
ఆ పదవిలో ఉన్న ఎరిక్ పాజ్ గత 30 ఏళ్లుగా చేస్తున్నది ఇదే. రాక్ఫెల్లర్ సెంటర్ సమ్మర్ హెల్పర్గా 1988లో ఎరిక్ ఉద్యోగ జీవితం ఆరంభమైంది. ఈ సారి ఇక్కడ కొలువుదీరనున్న ట్రీని న్యూయార్క్లోని వెస్టల్ నుంచి తరలిస్తున్నారు. దాని వయసు 80-85 ఏళ్లు. 80 అడుగుల ఎత్తు, 43 అడుగుల వెడల్పు, 12 టన్నుల బరువున్న ఆ క్రిస్మస్ ట్రీ ఈ నెల 11వ తేదీ కల్లా రాక్ఫెల్లర్ సెంటర్కు చేరుకోనుంది.
ఈ సారి 50 వేల విద్యుద్దీపాలతో దానిని అలంకరించనున్నారు.ఆ వెలుగుల మాల దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. 1999లో ఏర్పాటు చేసిన చెట్టే అతి భారీది. దాని ఎత్తు 100 అడుగులు. ఈ నెల 29న రాక్ ఫెల్లర్ సెంటర్ ట్రీ దీపాలను వెలిగిస్తారు. అంటే పండుగ మొదలైనట్టే.తిరిగి
వచ్చే ఏడాది జనవరి 13న ఈ క్రిస్మస్ ట్రీని తొలగిస్తారు. అనంతరం ఆ కలపను ముక్కలుగా చేసి ఆవాసాల నిర్మాణానికి విరాళంగా ఇస్తారు. ఈ ఆనవాయితీ 2007 నుంచి అమల్లో ఉంది.