36 killed in armed clashes between two tribes in Pakistan : భారత దాయాది సరిహద్దు దేశం పాకిస్తాన్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 36 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆగ్నేయ సరిహద్దులో ఉన్న ప్రాంతంలో ఓ గిరిజన భూమికి చెందిన వివాదం చెలరేగింది. దీనితో స్థానికంగా అక్కడే ఉంటున్న సన్నీ,షియా జాతుల మధ్య తీవ్ర విభేదాలు నెలకున్నాయి. గత ఐదు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సైనికాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో 36 మంది మరణించినట్లు ధృవీకరించారు అధికారులు. దాదాపు 200 మందికి పైగా తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారని..పరిస్థితిని చక్కదిద్ది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
రాజుకుంటున్న స్థల వివాదం
అప్పర్ కుర్రం ప్రాంతంలోని బోషెరా గ్రామంలో ఓ ల్యాండ్ కు సంబంధించి రెండు వర్గాలు తమదంటే తమదని కొట్టాటలు ప్రారంభించారు. వాస్తవానికి అది తమదేనంటూ గిరిజనులు కూడా రంగంలో దిగారు. దీనితో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరి ఇళ్లు మరొకరు తగలబెబ్టడం, కనిపిస్తే కత్తిపోట్లు వంటి చర్యలతో రెండు వర్గాల వారు హోరాహోరీగా దెబ్బలాడుకుంటున్నారు. ముందు సన్నీ, షియాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా గిరిజనులు, మత సమూహాల మధ్య ఘర్షణలుగా మారాయి. అక్కడ స్థానిక డిప్యూటీ కమిషనర్ రెండు వర్గాలకు సంబంధించిన పెద్దలను సమావేశపరిచి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అయినా హింసాత్మక సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఘర్షణలలో ఇరు వర్గాలు అత్యాధునిక యుద్ధ పరికరాలు ఉపయోగించడం గమనార్హం. ఏకంగా సైన్యం ఉపయోగించే రాకెట్ లాంఛర్లతో దాడులకు పాల్పడటం పోలీసులు, సైనికులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. వారికి ఇంత అత్యాధునిక సాంకేతిక యుద్ధ పరికరాలు ఎలా అందుతున్నాయని ఎంక్వయిరీ చేస్తున్నారు.
తాలిబాన్ల పాత్రపై అనుమానాలు
ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతం కావడంతో వీరిపై తాలిబాన్ల ప్రభావం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సున్నిత ప్రాంతాలయిన మక్బాల్, ఖార్ కలే, పీవార్, పారా చమ్కానీ, కుంజ్ అలీజాయ్, పీవార్ తదితర ప్రాంతాలను పోలీసులు, సైనిక అధికారులు అడుగడుగునా నిఘా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కార్డెన్ సెర్చ్ సోదాలతో ఇంటింటికీ వెళ్లి అక్కడ రాకెట్ లాంచర్లు, రాకెట్ షెల్స్ వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు పోలీసు వర్గాలు. అయితే నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఏ క్షణమైనా అదుపుతప్పే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఇబ్బందులపాలవుతున్న పౌరులు
పగటిపూట 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. గిరిజనులను ఒప్పించి వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ప్రజలు మాత్రం తమకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, పాలు, ఆహారపదార్థాల వంటి నిత్యావసరాల కోసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, తమకు ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలలో విద్యా సంస్థలను మూసివేశారు. పరిస్థితి చక్కబడేదాకా తెరవద్దని ఆదేశాలు ఇచ్చారు. కార్యాలయాలకు వెళ్లే వారికి పాస్ లు జారీ చేస్తున్నారు. అడుగడుగునా సోదాలు చేస్తున్నారు.