Israeli bombardment In Gaza| గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ చేసిన బాంబుదాడుల్లో గాజాలోని 29 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనాల ప్రకారం.. శుక్రవారం 19 మంది మరణించగా.. శనివారం మరో 10 మంది చనిపోయారు. శనివారం జబాలియాలోని ఇళ్లు, నుసెరాత్ శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ బాంబు వర్షం కురిపించింది.
ఉత్తర గాజాలోని జబాలియా దాని పరిసర ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను ఆదేశించింది. అయితే హమాస్ అధికారులు దీనికి వ్యతిరేకంగా సూచనలు చేశారు. ఉత్తర గాజాను వదిలి దక్షిణ గాజాకు వెళ్తే అక్కడ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయని అందుకోసం ప్రజలు ఉత్తర గాజాలోనే ఉండాలని ప్రజలకు సూచించింది.
ప్రజల ఇళ్లపై బాంబులు వేయడం గురించి మీడియా ప్రతినిధులు ఇజ్రాయెల్ సైన్యధికారులను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. “హమాస్ మిలిటెంట్లు పౌరుల ఇళ్లలో తలదాచుకొని ఉన్నారని అందుకే ముందుగా ప్రజలకు ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చిరించామని.. ఆ తరువాతనే బాంబు వేశామని అన్నారు. ఉత్తర గాజాలోని అద్వాన్ ఆస్పత్రిపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. కానీ దాడి చేయక ముందు ఆస్పత్రిలోని పేషంట్లను సురక్షితంగా గాజా నగరానికి తరలించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఉత్తర గాజాలోని అతిపెద్ద శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్య దళాలు భారీగా బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ శిబిరాల్లోనే ఎక్కువగా మిలిటెంట్లు దాగి ఉన్నారని.. ఒక్క శనివారం రోజునే 20 మంది మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. మరోవైపు హమాస్ ప్రతినిధులు స్పందిస్తూ.. చనిపోయిన వారంతా సామాన్య పౌరులని, మిలిటెంట్లు కాదని చెప్పారు. తాము మిలిటరీ దాడుల కోసం పౌర ప్రాంతాలను ఎప్పుడూ ఉపయోగించలేదని అన్నారు.
Also Read: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్
పాలస్తీనా ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం.. జబాలియాలో గత వారం రోజుల్లో 150 మంది ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. అక్టోబర్ 2023 లో ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల్లో ఇప్పటివరకు 42000 పాలస్తీనా వాసులు మరణించారు.
గాజాలో సామాన్య పౌరులను ఇజ్రాయెల హత్య చేస్తోందని ఇది పౌరుల ఊచకోత అంటూ ఇజ్రాయెల్ చర్యలను హమాస్ ప్రతినిధులు ఖండించారు. జబాలియా ప్రజలు ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయలేదనే ఇజ్రాయెల్ సైనికులు వారిని హత్య చేస్తున్నారని హమాస్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా సామాన్య పౌరులకు సురక్షితమైన ప్రదేశం లేకుండా పోయిందని ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ పై విమర్శలు చేసింది.
మరోవైపు లెబనాన్ లో హిజ్బుల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల్లో దాదాపు 1300 మంది చనిపోయారు. ఈ దాడుల్లో ఇటీవల ఇద్దరు ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా శనివారం మరో ఐరాస శాంతి కార్యకర్తపై ఇజ్రాయెల్ సైనికులు దాడి చేశారని.. అతని పరిస్థితి విషయంగా ఉందని సమాచారం. దీంతో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయెల్ తీరుని ఖండించాయి. ఇటలీ, స్పెయిన్ ప్రభుత్వాలు తమ దేశంలోని ఇజ్రాయెల్ దౌత్యాధికారులని పిలిచి మరీ ఈ ఘటనలపై వివరణ కోరాయని తెలిసింది. ఐరాస శాంతి కార్యకర్తలను ఎక్కువగా ఫాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు మానవ సేవా కార్యక్రమాల కోసం తమ ప్రతినిధులుగా లెబనాన్ కు పంపించాయి. ఐరాస్ చీఫ్ ఆంటోనీ గుటెరెస్ కూడా ఇజ్రాయెల్ తన అరచకాలను ఇప్పటికైనా ఆపాలని చెప్పారు.