Israel Attack On Gaza: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్దం కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాపై చాలా సార్లు ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. దీంతో వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా గాజాలో పెద్ద సంఖ్యలో ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడి ప్రజలకు ఆహారం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తాజాగా గాజాపై ఇజ్రాయిల్ దాడి చేయగా ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం కానున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ గాజాపై దాడికి పాల్పడింది. నెతన్యూహు యూఎస్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ జరగనుంది. మరో వైపు గాజాలో పోలియో వైరస్ మరింత విస్తరిస్తోంది. గాజాలో ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బెరెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయిల్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 27 మంది మృతి చెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే శనివారం యెమెన్లో ఉద్రిక్తత తారా స్థాయికి చేరుకుంది. యెమెన్లోని అల్ హోదైదా పోర్టును సమూలంగా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతే కాకుండా హూతీ తిరుగుబాటు దారులు ఇజ్రాయిల్పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. కానీ ఐడీఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండి మార్గమధ్యంలోనే దాన్ని కూల్చివేశాయి. తమ దేశ గగనతలం యారో- త్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీన్ని గుర్తించినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇలాట్ నగరంలో ఇప్పటికే తరచూ క్షిపణి రక్షణ వ్యవస్థ సైరన్లు మోగుతూనే ఉన్నాయి.
మరోవైపు ఐడీఎఫ్ దళాలు హెజ్బోల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు నిర్వహించాయి. రెండు భారీ ఆయుధ డిఫోలను కూడా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. వీటిలో భారీ ఎత్తున రాకెట్లు, ఇతర వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది. అద్ లౌన్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు మీడియా కూడా ధ్రువీకరించింది.
Also Read: ఉక్రెయిన్ యుద్ధ లక్ష్యాలు చేరుకోవడానికే మా ప్రాధాన్యం: రష్యా
అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. కొన్నాళ్ల నుంచి హుతీలు చేస్తున్న దాడుల తరువాత ఇజ్రాయిల్ స్పందించాల్సి వచ్చిందని . ఇజ్రాయిల్ రక్షణకు అమెరికా ఎప్పుడూ మద్దతిస్తుందని అన్నారు. ఇక మరో వైపు సౌదీ అరేబియా మాత్రమే దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి తుర్కీ ఆల్ మాల్కీ వెల్లడించారు. తమ గగనతలాన్ని వాడుకునేందుకు కూడా ఏ వర్గాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.