Shooting in Minnesota-USA : అమెరికన్ల జీవితంలో తుపాకుల మోతలు నిత్యకృత్యమయ్యాయి. నిరుడు 632 మూకుమ్మడి కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. అమాయకులతో పాటు పోలీసు ఉన్నతాధికారులూ మతి లేని వారి తూటాలకు బలవుతున్నారు. తాజాగా మిన్నెసోటాలో ఇద్దరు పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళనకు దారితీస్తోంది. పోలీసులపై కాల్పుల ఘటనలు 60 శాతం పెరిగినట్టు అంచనా. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతోంది.
అగ్రభాగాన అమెరికా
తుపాకులు ఎక్కువగా ఉన్న దేశం అమెరికాయే. ప్రతి వంద మంది అమెరికన్ల వద్ద 120.5 గన్స్ ఉన్నట్టు స్విస్కు చెందిన రిసెర్చి సంస్థ అంచనా వేసింది. 2011లో ఈ సంఖ్య 88 మాత్రమే. యెమెన్లో ప్రతి వంద మందికి 52.8 తుపాకులు, సెర్బియా, మాంటెనెగ్రోలో 39.1, ఉరుగ్వే, కెనడా దేశాల్లో 34.7 తుపాకులు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు గన్స్ కొనుగోలు చేయడమనేది గత కొన్నేళ్లుగా అగ్రరాజ్యంలో పెరుగుతోంది. 2019-21 మధ్య గన్ యజమానుల జాబితాలో కొత్తగా 75 లక్షల మంది చేరారు.
Read more: నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?
నియంత్రణపై గగ్గోలు
తుపాకీ సంస్కృతి అమెరికాలో భాగమైపోయింది. రాజకీయపరంగా మాత్రం ఇది చాలా సున్నితమైన అంశం. తుపాకుల నియంత్రణ మాట ఎత్తితే చాలు గగ్గోలు పెడతారు. ఆత్మరక్షణ, హక్కులనేవి ముందుకొస్తాయి. అయితే మెజార్టీ అమెరికన్లు మాత్రం తుపాకులపై నియంత్రణ ఉండాలనే కోరుకుంటున్నారు. కఠినమైన నియంత్రణ చట్టాలు ఉండాలని 57% భావిస్తున్నట్టు గాలప్ పోలింగ్లో వెల్లడైంది. చట్టాలు యథావిధిగా ఉండాలని 32% అభిప్రాయపడ్డారు. పదిశాతం మాత్రమే కఠిన నియంత్రణలు అవసరం లేదని చెప్పారు.
నిధుల వెల్లువ
గన్ పాలసీపై కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేయడమనేది జరుగుతూనే ఉంది. తుపాకుల నియంత్రణను వ్యతిరేకించే అతి పెద్ద లాబీ గ్రూప్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్. తుపాకుల సంస్కృతిని సమర్థిస్తూ ఆ గ్రూప్తో పాటు మరికొన్ని సంస్థలు పెద్దఎత్తున నిధులను గుమ్మరిస్తున్నాయి.
కాల్చుకోవడమూ అధికమే
ఒక్క 2021 సంవత్సరంలోనే అగ్రరాజ్యంలో తుపాకులకు 48,830 మంది బలయ్యారు. అక్కడ గన్స్తో కాల్చడమే కాదు.. కాల్చుకోవడమూ ఎక్కువే. 2021 నాటి తుపాకీ మరణాల్లో 54% ఆత్మహత్యలే. 26,238 మంది తమను తాము కాల్చుకుని చనిపోయారు. 43 శాతం మంది.. అంటే 29,958 మంది కాల్పులకు బలయ్యారు.
కాల్పుల ఘటనలు తీవ్రం
ఇక ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో 549 మరణించగా.. పోలీసుల తూటాలకు 537 మంది నేలకొరిగారు. 2019తో పోలిస్తే 2021లో తుపాకీ కాల్పుల మరణాలు 23 శాతం మేర పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుపాకీ మరణాలు అత్యధికంగా 1974లో చోటుచేసుకున్నాయి. ఆ ఏడాది లక్ష మంది జనాభాకు 16.3 మరణాలు నమోదయ్యాయి. 2021 నాటికి ఈ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఆ ఏడు 14.6 మరణాలే చోటుచేసుకున్నాయని ప్యూ రిసెర్చి సర్వేలో తేలింది.
హ్యాండ్ గన్లే ఎక్కువ
కాల్పుల కోసం ఏ ఏ తుపాకులు ఎక్కువగా వినియోగిస్తారు? అనే అంశంపై ఎఫ్బీఐ లెక్కలు సేకరించింది. హంతకులు ఎక్కువగా హ్యాండ్ గన్లపై ఆధారపడతారని తేలింది. 2020 నాటి గణాంకాల ప్రకారం 13,620 హత్యల్లో 59% హ్యాండ్ గన్ల సాయంతోనే చేశారు. అసాల్ట్ వెపన్స్ కేటగిరీలోకి వచ్చే రైఫిల్స్ వాడకమూ ఎక్కువే. ఇవి 3 శాతంగా ఉన్నట్టు ఎఫ్బీఐ వెల్లడించింది. షాట్గన్స్తో మరణాలు ఒక శాతంగా ఉన్నాయి.