Papua New Guinea : అల్లర్లు, దహనాలు, లూటీలతో పపువా న్యూ గినియా అట్టుడికింది. రాజధాని పోర్ట్ మోర్స్బీ ప్రజ్వరిల్లిన హింసకు 15 మంది బలయ్యారు. దుకాణాలు, కార్లను తగులబెట్టారు. సూపర్ మార్కెట్లలో యథేచ్ఛగా లూటీ కొనసాగింది. వేతనాలకు సంబంధించి పోలీసులు సమ్మెలోకి వెళ్లిన దరిమిలా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.
చట్టాలను ఉల్లంఘిస్తే ఎంత మాత్రం సహించబోమని ప్రధాని జేమ్స్ మరాపీ ప్రజలను హెచ్చరించారు. రాజధాని మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకూ హింస పాకింది. పోర్ట్ మోర్స్బీలో 8 మంది చనిపోగా.. లే నగరంలో మరో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల వేతనాల్లో సగం వరకు కోత పడటంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం పార్లమెంట్ వద్ద నిరసనలకు దిగారు.
అయితే కంప్యూటర్ల పొరపాటు వల్ల ప్రభుత్వ సిబ్బంది జీతాలు దాదాపు రూ.8 వేలు తక్కువగా పడ్డాయే తప్ప.. పన్నుల పెంపు వల్ల కాదని ఉద్యోగులకు నచ్చచెప్పారు. కాగా.. పపువా న్యూ గినియా ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ద్రవ్యోల్బణం 8 శాతానికి, నిరుద్యోగిత రేటు 2.5 శాతానికి చేరుకుంది. ఏడాదిగా ఈ పసిఫిక్ ద్వీప దేశంలో నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ క్రైం ఇండెక్స్ 80.79కి చేరింది.