Yash : పాన్ ఇండియా స్టార్ యశ్ బర్త్ డే సందర్బంగా జనవరి 8న ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న యశ్ మృతి చెందిన ముగ్గురు అభిమానుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చాడు. యశ్ రావడంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. వారిని ఓదార్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
“నాకు ఇంతమంది ఫ్యాన్స్ రావడం నా అదృష్టం. నేనెప్పుడూ నాకోసం బ్యానర్లు కట్టి హంగామా చేయమని అడగను.ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఏమన్నా జరుగుతుందేమోనని నేను భయపడుతున్నాను. ఈ ప్రమాదం లో ముగ్గురు మరణించడం చాల బాధగా వుంది. చేతికి అంది వచ్చిన బిడ్డలు ఇక తిరిగి రారని తెలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ యువకుల కుటుంబాలకు ఏది అవసరమో అది నేను చేస్తాను . ఆ తల్లితండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారు. ఆ కుటుంబాల కోసం ఎప్పటికీ అండగా వుంటాను. ఆ కుటుంబాలకు నేను కుమారుడు స్థానంలో ఉండి నా బాధ్యతలు నెరవేరుస్తాను. అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే . జీవితం లో సంతోషంగా వుండండి . మా గురుంచి ఆలోచించకండి. మీ తల్లి దండ్రుల గురించి ఆలోచించండి. ఇక నుంచైనా కటౌట్లు కట్టడం వంటి పనులు వదిలేయండి.” అని యశ్ అన్నాడు.
“రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయనే నివేదికల కారణంగా ఈ సారి నా పుట్టిన రోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే షూటింగ్ పని మీద గోవాలో వున్నాను. ఈ వార్త వినగానే నేను చాల బాధపడ్డాను. గత సంవత్సరం కూడా అలాంటి సంఘటనే జరిగింది. నా బర్త్ డే అంటేనే భయమేస్తుంది.” అని యశ్ ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి.. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వారికి కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.