Wayanad Landslide:కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఎంతోమంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విధ్వంసం వలన మరెంతోమంది గాయాల పాలయ్యారు. ఇంకా ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి.ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది.
ఇక ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రజలకు అండగా తామెప్పుడు ఉంటామని ఇండస్ట్రీ స్టార్స్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ఈ విపత్తులు జరిగినప్పుడు తమకు తోచిన సాయం చేస్తూ మంచి మనసును చూపిస్తూనే ఉన్నారు. ఇక వయనాడ్ బాధితుల కోసం కూడా ఎంతోమంది సినీ ప్రముఖులు తమకు చేతనైనంత సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్, సూర్య, మోహన్ లాల్, కమల్ హాసన్ తదితరులు తమ వంతు సాయంగా విరాళాలు అందజేశారు. ఇక రెండు రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి.. కేరళ వెళ్లి స్వయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు చెక్ అందజేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వయనాడ్ కోసం సీనియర్ హీరోయిన్స్ తమ వంతు సాయం చేశారు.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ అయినా మీనా, కుష్బూ, సుహాసిని, శ్రీ ప్రియ, కళ్యాణి ప్రియదర్శన్, శోభన వీరందరూ కలిసి కోటి రూపాయల చెక్కును కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి అందించారు. వారి కుటుంబ సభ్యుల నుంచి విరాళాలు పోగుచేసి ఈ డబ్బును అందజేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు సీనియర్ హీరోయిన్స్ ను ప్రశంసిస్తున్నారు.