Vyooham: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెన్షన్ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం వ్యూహం, శపధం అనే రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం ‘వ్యూహం’ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఎఫ్సీ జారీ చేసిన సర్టిఫికేట్ను నిలిపివేసింది. అయితే ఈ సర్టిఫికేట్ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తరపు న్యాయవాది హైకోర్టులో విజ్ఞప్తి చేశారు.