Virupaksha Movie Review : మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన మూవీ విరూపాక్ష. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే సమకూర్చడం, ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ ఈ మూవీకి డైరెక్టర్ కావడంతో విరూపాక్షపై అంచనాలు భారీగా పెరిగాయి. సగటు సినీప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..
కథేంటంటే?..
రుద్రవనం అనే ఊరులో చేతబడి చేస్తూ చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ ఓ జంటను గ్రామస్థులు సజీవ దహనం చేస్తారు . వారు మంటల్లో కాలిపోతూ 12 ఏళ్ల తర్వాత ఈ ఊరు వల్లకాడు అయిపోతుందని శపిస్తారు. ఆ విధంగానే ఆ ఊరిలో వరుసగా మరణాలు సంభవిస్తాయి.దీంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని తీర్మానిస్తారు పెద్దలు. కొన్ని రోజులపాటు ప్రజలు బయటికి వెళ్లడానికి కానీ.. కొత్తవాళ్లు ఊళ్లోకి రావడానికి కానీ అవకాశం లేకుండా చేస్తారు. అయినా సరే మరణాలు మాత్రం ఆగవు. తన తల్లితో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన సూర్య అంటే సాయిధరమ్ తేజ్ తిరిగి వెళ్లే అవకాశం ఉన్నా.. తాను మనసుపడిన నందిని అంటే సంయుక్త ప్రాణాలను కాపాడటం కోసం మళ్లీ ఊళ్లోకి తిరిగొస్తాడు. ఈ చావుల వెనకున్న రహస్యాల్ని ఛేదించాలని సంకల్పిస్తాడు. మరి సూర్య ఏం చేశాడు? ఈ వరుస మరణాల వెనక ఎవరున్నారనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..?
1979లో కథ మొదలవుతుంది. కథకి బలమైన స్క్రీన్ప్లే తోడవడంతో సినిమా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. దంపతుల తాంత్రిక పూజలతో కథ మొదలవుతుంది. కథానాయకుడు రుద్రవనంలోకి అడుగుపెట్టడం నుంచి ప్రేమకథతో సినిమా మొదలైనా.. ఎవరూ ఊహించని రీతిలో సంభవించే మరణాలతో ఆసక్తి మొదలవుతుంది. ఆ మరణాలు సంభవించే విధానం కూడా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.
సెకండాఫ్ .. థ్రిల్లింగ్..
రహస్యాన్ని ఛేదించే క్రమంలో కథానాయకుడికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లే క్రమంలో రహస్యాలు ఒకొక్కటిగా వెలుగులోకి రావడంతో సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది. భైరవ ఎక్కడున్నాడో కనిపెట్టే క్రమం.. అసలు ఊరి జనాల ప్రాణాలు ఎవరి గుప్పిట్లో ఉన్నాయో తెలియడం లాంటి సన్నివేశాలు సినిమాకు కీలకం. మొత్తంగా ప్రేక్షకులకు ఓ మంచి థ్రిల్లర్ను చూసిన అనుభూతి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..?
సాయిధరమ్ తేజ్ రహస్యాన్ని ఛేదించేందుకు ధైర్యంగా ముందుకెళ్లే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. నటనలో సహజత్వం కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సంయుక్త మేనన్ తన నటనతో ఆకట్టుకుంది. అజయ్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సాయిచంద్, సునీల్, శ్యామల పాత్రలకు మంచి ప్రాధాన్యం దక్కింది. శ్యామ్ దత్ కెమెరా అద్భుతంగా ఉంది. రాత్రి సన్నివేశాలు, రుద్రవనాన్ని చూపించిన విధానం చాలా బాగుంది. అజనీష్ లోక్నాథ్ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సుకుమార్ అందించిన స్క్రీన్ప్లే సినిమాకు ప్రధానబలం. ఆరంభం నుంచి చివరి వరకు కథలో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
యాక్టర్స్ : సాయిధరమ్ తేజ్, సంయుక్త, రవికృష్ణ, సోనియా సింగ్, అజయ్, బ్రహ్మాజీ, సాయిచంద్, సునీల్, రాజీవ్ కనకాల, శ్యామల
స్క్రీన్ ప్లే : సుకుమార్
కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్
మ్యూజిక్ : B. అజనీష్ లోక్నాథ్
ఎడిటర్ : నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగల
సమర్పణ : బాపినీడు
నిర్మాత : BVSN ప్రసాద్
సంస్థ : శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర LLP, సుకుమార్ రైటింగ్స్
డైరెక్టర్ : కార్తీక్ వర్మ దండు