Victory Venkatesh : ఏ దారిలో వెళ్తేనేం… పాన్ ఇండియా వైపు నడిస్తే చాలు. ప్రస్తుత హీరోలకు పాన్ ఇండియా సినిమాలు చేయడం కష్టం. ఊరికనే పది భాషల్లో విడుదల చేసినంత మాత్రాన సరిపోదు.. అది హిట్ అవ్వాలి. కనీసం దానిపై బజ్ క్రియేట్ కావాలి. పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకోవాలి. కాంతారా, కేజీఎఫ్, కార్తికేయ గురించి అలాగే మాట్లాడుకున్నారు. పుష్పకు కూడా పాన్ ఇండియా ఇమేజ్ దానివల్లే వచ్చింది. ఇదే టెంపోలో కొందరు పాన్ ఇండియా పేరుతో ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. కాని, విక్టరీ వెంకటేష్ మాత్రమే ఇలా చేతులు కాల్చుకోకుండా సరికొత్త రూట్లో వెళ్తున్నాడు.
ప్రస్తుతం ఏదైనా సినిమా పాన్ ఇండియా లెవెల్లో వెళ్లాలంటే రెండే దారులు. ఒకటి.. ఆ హీరోకి ఇండియా లెవెల్లో అప్పీల్ అయినా ఉండి ఉండాలి. రెండోది.. దర్శకుడికి అంత సత్తా ఉండాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారంటే.. పాన్ ఇండియా లెవెల్ ఇంట్రస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి గాని, ప్రశాంత్ నీల్ గానీ.. వెంకీని పెట్టి సినిమా తీసేంత సీన్ లేదు. కాకపోతే.. ఇవేం లేకుండానే పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నాడు విక్టరీ వెంకటేష్. రామానాయుడు వెబ్ సిరీసే ఇందుకు కారణం. తెలుగు ప్రేక్షకులు తిట్టుకుని ఉండొచ్చు గానీ.. నార్త్ ఆడియన్స్ బాగానే ఆస్వాదించారు ఆ కంటెంట్ని. నిజానికి తెలుగు వాళ్లు కూడా అందులో ఏముందో చూస్తే పోలా అని చూసేశారు.. అది వేరే మ్యాటర్.
ఇక సల్మాన్ ఖాన్తో కలిసి కాటమరాయుడు రీమేక్ సినిమాలో నటించాడు వెంకటేష్. నిజానికి ఈ సినిమాలో వెంకీ రోల్ చూసి ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. పోయి పోయి ఇలాంటి క్యారెక్టర్ చేశాడేంటా అని. అయినా సరే… ఈ సినిమా ఫ్లాప్ అయినా మన విక్టరీ వెంకటేష్కి పాన్ ఇండియా అప్పీల్ అయితే వచ్చేసింది. జాతీయ స్థాయిలో మన వెంకీ అంటే ఎవరో తెలిసొచ్చింది. సౌత్ ఆడియన్స్కు వెంకటేష్ను పరిచయం చేయక్కర్లేదు. రానా నాయుడు, సల్యాన్ ఖాన్ మూవీతో ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు వెంకీ ఎవరో పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సో, వెంకీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. హీరోగా ఛాన్సులు ఇస్తారో లేదో తెలీదు గానీ.. ఇప్పటికైతే రెండు మల్టీ నేషనల్ కంపెనీలు వెంకీని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇక వేడిలో వేడి.. వెంకీ నటిస్తున్న సైంధవ్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రానా నాయుడు తెచ్చిన క్రేజ్ను ఈ సినిమా కోసం వాడుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి దారి ఏదైతేనేం.. వెంకీ సాధించాడు అంతే.