Veerasimhareddy : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు హంగామా మొదలైంది. ఒంగోలులోని బీఎంఆర్ వెంచర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డుల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
తొలుత వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకను రైల్వేస్టేషన్ సమీపంలోని ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ వేడుక నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. త్రోవగుంట సమీపంలోని బీఎంఆర్ అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన స్థలంలో వేడుకకు పోలీసులు అనుమతినిచ్చారు. శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ఎస్పీ మలికా గార్గ్తో సమావేశమై వేడుకపై చర్చించారు. అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన 17 ఎకరాలను అధికారులతో కలిసి పరిశీలించి ఇక్కడ వేడుక నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. చివరకు వేడుక నిర్వహణకు పోలీసులు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చారు.
గురువారం ఉదయం పనులు మొదలుపెట్టిన నిర్వాహకులు సాయంత్రానికి ప్రధాన వేదిక, లైటింగ్, ఎల్ఈడీ తెరలు, బారికేడ్లు, వివిధ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టారు. అదనపు ఎస్పీ కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వేడుక ప్రాంగణాన్ని సందర్శించి సూచనలు చేశారు. వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. రూ.15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిర్వహకులను కోరారు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను లోపలికి రానివ్వకూడదని స్పష్టంచేశారు. అక్కడ జరిగే ప్రతి ఘటనకు నిర్వాహకులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు.
నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని.. వాటికి కూడా స్థానిక పోలీసుల స్టాంపింగ్ తప్పనిసరని పేర్కొన్నారు. గ్యాలరీలు పటిష్టమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాణసంచా కాల్చకూడదని స్పష్టం చేశారు. నిర్వాహకులు తగిన సంఖ్యలో బౌన్సర్లు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులను ప్రాంగణంలోకి అనుమతించకూడదన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ను శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ట్రైలర్ విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానులు సోషల్మీడియా వేదికగా కౌంట్డౌన్ మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్ నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.
అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో వేదిక ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. తొలుత ఈ వేడుకను విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ప్రభుత్వ అధికారుల సూచనలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నిర్వాహకులు మారుస్తున్నారు. ఈ వేడుకను జనవరి 8న నిర్వహించనున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.