Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీంచద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా సినిమాను జనవరి 12న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో బాగంగా ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఒంగోలులోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించటానికి ప్లాన్ చేశారు. అయితే పార్కింగ్ ప్రాబ్లమ్ సహా భారీగా అభిమానులు వస్తే ట్రాఫిక్ సమస్య వస్తుందని భావించిన పోలీసులు ఏబీఎం కాలేజీలో కాకుండా.. అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్లో ఈవెంట్ను నిర్వహించుకోవటానికి అనుమతి ఇచ్చారు.
అయితే ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పలు రకాలైన ఆంక్షలను విధించింది ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరింది. గ్రౌండ్ కెపాసిటీ 28500 కాబట్టి అంతే మందిని అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే వేడుకను నిర్వహించాలని నిర్వాహకులకు పోలీసులు స్ట్రిట్ వార్నింగ్ ఇచ్చారట.
బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు.