Javed Akhtar: భారతీయ సినిమాలపై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ భారతీయ సినిమాల్లో చాలా మార్పులొచ్చాయని ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలో డైరెక్టర్లే నిర్ణయించుకోవాలని సూచించారు. సెంట్రల్ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగిన 9వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో.. జావేద్ అక్తర్ పద్మపాణి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. భారతీయ సినిమాకు గీత రచయితగా, కవిగా ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వకాలంలో హీరోలు విభిన్నంగా ఉండేవారని, నేటి సినిమాల్లో హీరోల పాత్రలను ఇష్టానుసారం చిత్రీకరించడం బాలేదని అభిప్రాయపడ్డారు.
సినిమాలను నిర్మించడంలో కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తోన్నప్పటికీ.. భాష, సాహిత్యం, శాస్త్రీయ సంగీతం వంటివి వెనుకబడిపోయాయని పేర్కొన్నారు. కానీ మహారాష్ట్రలోని చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ప్రజలకు ఇవి నేటికీ విలువైనవని కొనియాడారు. తాను సినిమాలకు స్క్రిప్ట్ లు రాసేటపుడు వాటి ఆర్థిక లేదా సామాజిక ప్రభావం గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారు.
ఒక సినిమా హీరో తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని.. తల్లిదండ్రులనే ఎదిరించిన ఘటనలున్నాయి. కానీ.. ఆ తర్వాత అదే అమ్మాయి నచ్చలేదని అసమానతలు చూపించడం, కోర్టులు, విడాకులు వంటి విషయాలతో కూడిన సినిమాలను కూడా ఆ హీరోలే తీస్తున్నారు. అలాంటి పాత్రలున్న సినిమాలు ప్రజాదరణ పొందవని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి దర్శకులు ఎలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకాదరణ లభిస్తుందో ఆచితూచి ఎంచుకోవాలని సూచించారు. అలాంటి సినిమాలు సినీ పరిశ్రమను కూడా బలోపేతం చేస్తాయన్నారు.