T.P.Madhavan: మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
1975లో రాగం అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టాడు మాధవన్. అప్పటికి ఆయన వయస్సు 40 పై మాటే. ఆ వయస్సులో నటుడిగా మారిన ఆయన మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా విలన్ గా మాధవన్ కు మంచి పత్రాలు పడ్డాయి.
దాదాపు 600 సినిమాలకు పైగా ఆయన నటించారు. ” నాడోడిక్కట్టు, పందిప్పాడ, ఆర్డినరీ, ఓరు సీబీఐ డైరీ కురుప్పు, అయల్ కధ ఎళుత్తుకాయన్, సందేశం, నమ్మాల్, నరసింహం, మూనమ్ మురా, అచ్చువెట్టంటే వీడు, ఆరం తంపురాన్” లాంటి సినిమాలు మాధవన్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి.
కేవలం నటుడిగానే కాకుండా మలయాళ అమ్మ అసోసియేషన్ కు మొదటి జనరల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించాడు. ఇక చివరగా మాధవన్ నటించిన చిత్రం మాల్గుడి డేస్. ఆ తరువాత సినిమాలకు స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక మాధవన్ కుమారుడు రాజా కృష్ణ మీనన్. బాలీవుడ్ దర్శకుల్లో ఒకరు. పిపా, చెఫ్, ఎయిర్ లిఫ్ట్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఇక మాధవన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడు రోజుల క్రితమే నటుడు మోహన్ రాజ్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణాన్ని ఇంకా మరిచిపోకముందే మరో నటుడు కన్నుమూయడం బాధాకరంగా ఉందని మలయాళ ఇండస్ట్రీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.