Tollywood : టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ హీరోల విషయంలో అయితే పరిస్థితి మరీ దారుణం. అయితే హీరోయిన్ల విషయంలో ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. అది కూడా మెగా హీరోలకు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాకా ఐటమ్స్ గర్ల్స్ కోసం వెతుకుతున్నారు.
ఐటం గర్ల్స్ వేటలో ‘విశ్వంభర’
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సోషియో ఫ్యాంటసీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ‘విశ్వంభర’ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కమర్షియల్ అంశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ కి చిరు చిన్న విరామం ఇచ్చారు. కొన్ని రోజుల నుంచి చికెన్ గున్యాతో బాధపడుతున్న చిరు సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన ఈ గ్యాప్ లోనే గిన్నిస్ రికార్డు ఈవెంట్, ఐఫా 2024 ఈవెంట్లకు హాజరయ్యి, అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నాడు. మరోవైపు ‘విశ్వంభర’ బృందం సెప్టెంబర్ నెలలో ఒక సెట్లో ఐటెం సాంగ్ను చిత్రీకరించాలని ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ పోస్ట్ పోన్ అయ్యిందని, ఇప్పుడు అక్టోబర్లో ఈ పాటను చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఐటం సాంగ్ కోసం హీరోయిన్ల వేట సాగుతోంది. ‘విశ్వంభర’ సాంగ్ విషయంలో చాలామంది హీరోయిన్ల పేర్లు విన్పిస్తున్నప్పటికి ఇంకా మేకర్స్ మాత్రం ఎవ్వరినీ కన్ఫామ్ చేయలేదని సమాచారం. మరి చివరకు ఈ పాట కోసం మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. కాగా పాటల చిత్రీకరణ కోసం హైదరాబాద్ నగర శివార్లలో భారీ సెట్ను నిర్మించనున్నారు.
‘పుష్ప’రాజ్ కు కూడా ఇదే సమస్య
మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 : ది రూల్” షూటింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2: రూల్ డిసెంబర్ 6న విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా ఓ ప్రత్యేక పాట ఉంది. సుకుమార్ తన టీమ్తో కలిసి గత ఆరు నెలలుగా ఆ పాట కోసం హీరోయిన్ ను వెతుకుతూనే ఉన్నాడు. శ్రీ లీల, త్రిప్తి డిమ్రి తదితరుల పేర్లు విన్పిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఎవ్వరూ ఫైనల్ కాలేదని సమాచారం. ప్రైమరీ షూటింగ్ పూర్తయిన తర్వాత అక్టోబర్ చివరి వారంలో పాటల చిత్రీకరణ జరగనుంది. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ స్పెషల్ నంబర్కి పెప్పీ ట్యూన్ను కంపోజ్ చేశారు. టీమ్కి సరైన నటి దొరకకపోవడంతో పాటల చిత్రీకరణ ఆలస్యమైంది.