Tollywood Lady Producer Cheating a Young Camera Man: కొద్దిరోజుల క్రితం లిఫ్ట్ పేరుతో బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఆశామల్లికను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం గుర్తుందా ? ఇప్పుడు ఆమె కేసులో తవ్వేకొద్దీ.. విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. ఎస్సై గోవర్థన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఆమెకు పెళ్ళిళ్లు జరిగిన విషయాన్ని దాచిపెట్టి ప్రేమ పేరుతో మరో యువకుడిని వలలో వేసుకుని.. అందినకాడికి డబ్బు దండుకుంది. తీరా ఆమె గురించి తెలిసి సదరు యువకుడు విస్తుపోయాడు. పోలీసులను ఆశ్రయించాడు.
భైరవపురం సినిమా నిర్మాత ఆశామల్లికకు షూటింగ్ లో వెంకటగిరికి చెందిన అసిస్టెంట్ కెమెరామెన్ పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసిన ఒక సినిమా షూటింగ్ లో ఆశామల్లిక నిర్మాతగా పరిచయమైంది. సినిమా షూటింగ్ పూర్తయ్యాక సదరు మహిళ అతనికి ఫోన్ చేసి.. డిన్నర్ చేసేందుకు ఇంటికి ఆహ్వానించింది.
తనకు పెళ్లైన విషయాన్ని చెప్పి.. భర్తకు విడాకులిచ్చి.. పెళ్లి చేసుకుందామని నమ్మబలికింది. ఆమె మాటలను గుడ్డిగా నమ్మేసిన నాగార్జున.. ఓకే చెప్పాడు. కట్ చేస్తే ఇద్దరూ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆమె అతడి నుంచి రూ.18,50,000 నేరుగా తీసుకుంది. మరో రూ.10 లక్షలను బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. పెళ్లి తర్వాత ఆశామల్లిక ప్రవర్తనలో మార్పును గమనించిన నాగార్జున.. ఆమె గురించి విచారించగా.. ఒకటి కాదు.. రెండు పెళ్ళిళ్లు అయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. తనను మూడో వివాహం చేసుకుందని తెలిసి షాకయ్యాడు.
తనకు ఒకసారి మాత్రమే పెళ్లైందని, పిల్లలు లేరని చెప్పి.. లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని గ్రహించాడు. గతంలో ఆమె పలువురిపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్ గాజువాక పీఎస్ లో భరత్ అనే వ్యక్తిపై, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అనే వ్యక్తిపై, నార్సింగ్ పీఎస్ లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసి.. ఇబ్బందులకు గురిచేసిందని, తనను కూడా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని, తన ఆస్తిలో వాటా కావాలని అడుగుతోందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.