Tisha Kumar: టి-సిరీస్ చైర్పర్సన్ భూషణ్ కుమార్ బంధువు మరియు అతని మామ, నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె తిషా కుమార్(20) క్యాన్సర్ తో పోరాడుతూ మరణించింది. గురువారం ఆమె మరణించినట్లు టీ సిరీస్ అధికారికంగా ధృవీకరించింది.
క్రిషన్ కుమార్ కుమార్తె తిషా కుమార్ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత నిన్న మరణించారు. ఇది కుటుంబానికి కష్టమైన సమయం, మరియు కుటుంబం యొక్క గోప్యతను గౌరవించాలని మేము దయతో అభ్యర్థిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో క్రిషన్ కుమార్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంత చిన్న వయస్సులోనే ఆమె మృతి చెందడం చాలా పెద్ద విషాదమని బాలీవుడ్ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.
ఇక ఆమె మరణించిన 4 రోజుల తరువాత .. అంటే ఈరోజు ఆమె అంత్యక్రియలను జరిపించారు. అసలు ఆమె అంత్యక్రియలు ఆదివారం జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఈరోజు జరిగాయి. ఇక తిషా కుమార్ ను కడసారి చూడడానికి బాలీవుడ్ ప్రముఖులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చారు.
రితేష్ దేశ్ ముఖ్, సాయి మంజ్రేకర్, ఫరా ఖాన్, ఓం రౌత్ తదితరులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తిషా కుమార్.. తమ సంస్థల్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రీమియర్ కు హాజరయ్యేది. అలానే అనిమల్ సినిమా ప్రీమియర్ షోలో కూడా ఆమె పాల్గొంది. తిషా కుమార్ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.