Amitabh – Rajini : కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్. అది హీరో హీరోయిన్సే కానక్కర్లేదు. హీరో – దర్శకుడు కావచ్చు. లేదా ఇద్దరు హీరోలు కావచ్చు. అలాంటి ఓ ఎవర్ గ్రీన్ క్రేజీ కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనుంది. వారేవరో కాదు.. ఒకరేమో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ అయితే మరొకరు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్. అవును వీళ్లిద్దరూ 32 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయబోతున్నారు. అంతకు ముందు వీరిద్దరూ కలిసి అంధాకానూన్, గైరాఫ్తర్, హమ్ సినిమాల్లో నటించారు. అన్నీ సినిమాలు సక్సెస్ను సాధించాయి. 1991లో వచ్చిన హమ్ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. ఇప్పుడు రానుంది. అంటే ఈ అపూర్వ కలయికకు 32 ఏళ్లు పట్టింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజినీకాంత్ చేయబోతున్న చిత్రం. ఆయనకు 170వ సినిమా. జై భీమ్ వంటి సెనసేషనల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ కనిపించబోతున్నారు. మరి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన విషయమే. అమితాబ్ బచ్చన్ నటించనున్న తొలి తమిళ చిత్రమిదే అవుతుంది. ఆయన ఈ మధ్య దక్షిణాది సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. తెలుగులో సైరా నరసింహా రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు తమిళంలోకి కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు.
ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తోన్న జైలర్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న లాల్ సలామ్ చిత్రంలో తలైవర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే. కాగా.. ఇప్పుడు లైకానే మరో సినిమాను చేయటానికి రజినీకాంత్ రెడీ అయిపోయారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకట వెలువడనుంది.