Telugu Movies Stopped in Pre-Production : తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే పిచ్చి క్రేజ్. ముఖ్యంగా స్టార్ హీరో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబోలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే టాలీవుడ్లో పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు చాలా సినిమాలు చేద్దామనుకున్నారు. కానీ పలు కారణాలతో ప్రీ ప్రొడక్షన్స్లోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతే.. మరికొన్ని అనౌన్స్ మెంట్ అయ్యాక.. కొన్ని సినిమాలైతే ఏకంగా సెట్స్ ఎక్కడానికంటే ముందే అటకెక్కేశాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమా వస్తుందని విపరీతమైన ప్రచారం వచ్చింది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘జవాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత అట్లీ రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్. ఏకంగా రూ.60కోట్లు అడిగినట్లు సమాచారం. దీంతో రాజీ కుదరకపోవడంతో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించాలని అనుకోగా..కుదరకపోవడంతో ఈ సినిమా అటకెక్కింది. తర్వాత కొరటాల శివ, వేణుశ్రీరామ్తో కమిటైన సినిమాలు సైతం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
సూపర్ కాంబినేషన్..రవితేజ, గోపిచంద్..
రవితేజ కెరీర్లో ‘క్రాక్’ రూపంలో గోపీచంద్ మలినేని సూపర్ హిట్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. తర్వాత రవితేజతో గోపీచంద్ మరో సినిమా చేయాలనుకున్నాడు. క్రాక్ మాదిరిగా తీయాలనుకున్న తరుణంలో ఏమైందో తెలియదు. కానీ ఆ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సిన ఈ సినిమా.. బడ్జెట్ కారణాలతో క్యాన్సిల్ అయింది.
సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ మూవీ..
‘విరూపాక్ష’ సినిమా తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ మంచి కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు సంపత్ నందితో కలిసి ‘గంజాశంకర్’ సినిమాను అనౌన్స్ చేశాడు. మొదట ఈ సినిమాను జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించాలి. కానీ సూర్యదేవర నాగవంశీ తీసుకున్నారు. కానీ బడ్జెట్ కారణాలతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లోనే ఆగిపోయింది.