Jani Master: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ గెలిస్తే.. పువ్వులు పరిచి స్వాగతం పలుకుతారు. ఓడిపోతే.. ముళ్లమీద నడిపిస్తారు. ప్రశంసలు అందుకున్నట్టే విమర్శలను అందుకుంటేనే.. ఈ రంగంలో ఉండగలరు. ఈ సమాజంలో ఆడవారికి రక్షణ లేదు అనేది నమ్మదగ్గ నిజం. అందులో సినీ రంగంలో ఉన్నవారికి అస్సలు లేదు అంటే నిజమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు హీరోయిన్స్ సెట్ లో ఎవరైనా లైంగికంగా వేధిస్తే బయటకు చెప్పడానికి భయపడేవారు. ఆ తరువాత కాలం మారుతున్నకొద్దీ హీరోయిన్స్ లో మార్పు వచ్చింది.
కొంతమంది కెరీర్ నాశనం అవుతుందని, పేరు పోతుందని భయపడి తమను లైంగికంగా వేధించిన వారి గురించి బయటకు చెప్పలేదు. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరైనా తమను చెడ్డ ఉద్దేశ్యంతో చూసినా కూడా సోషల్ మీడియా వేదికగా వారిని ఎండగడుతున్నారు. ఇక ఈ మధ్య మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన హేమా కమీటీ వచ్చాకా.. సినిమా రంగంలో ఎలాంటి బాధితురాలు భయపడడం లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశాలు ఇప్పిస్తామని, డబ్బు లు ఇస్తామని ఆశ చూపి .. నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడితే హేమా కమిటీ ఊరుకోదు అని భయపడేలా నిరూపించింది. ఎన్నో ఏళ్లుగా నటీమణులను లైంగికంగా వేధిస్తున్న నటుల గుట్టు మొత్తాన్ని రట్టుచేసింది.
Jani Master Case : బాధితురాలికి అండగా అల్లు అర్జున్… ఆమె కోసం ఊహించని డెసిషన్
ఇక ఇప్పుడు మాలీవుడ్ పరిస్థితినే టాలీవుడ్ ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ నటి కానీ, ఏ ఆర్టిస్ట్ కానీ.. తమను వేధించారని డైరెక్ట్ గా పోలీసుల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ, నిన్నటికి నిన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఒక యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, మతం మార్చుకోమని టార్చర్ పెడుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తనపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది.
ఇక ఈ కేసుపై జానీ మాస్టర్ వాదన వేరేలా ఉంది. తానేమి తప్పు చేయలేదని, ఆధారాలతో నిరూపిస్తే కచ్చితంగా నేను శిక్ష అనుభవిస్తాను అని చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. దీంతో ఆమెకు అండగా ఇండస్ట్రీ మొత్తం దిగివచ్చింది. జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. నిజంచెప్పాలంటే .. ఈ కేసుతోనే టాలీవుడ్ లో కూడా హేమా కమిటీ లాంటిది పెట్టడానికి పునాది వేయవచ్చు. ప్రభుత్వం ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయడానికి ఇదే అనువైన సమయమని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే జానీ మాస్టర్ కేసు తరువాత.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ప్యానెల్ లో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్పర్సన్ గా ఉండగా అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఉన్నారు. ఇక బాహ్య సభ్యులుగా రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు, కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు ఉన్నట్లు TFCC అధికారికంగా తెలిపింది.
ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను సంప్రదించవచ్చని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచబడింది, దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. మరి ఈ కమిటీ వలన బాధింపపడినవారికి న్యాయం చేకూరుతుందా.. ? లేదా ..? అనేది తెలియాలి.