Devara Movie Release: ఈ ఏడాదిలో తెలుగు నుండి పలు ప్యాన్ ఇండియా చిత్రాలు బయటికి వచ్చాయి. అవి హిట్ కూడా అయ్యాయి. అదే రూట్లో మరో ప్యాన్ ఇండియా మూవీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ హీరో నుండి మూడు సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. అందుకే ఈ మూవీ ఎలా ఉంటుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే ‘దేవర’ చూడాలనుకుంటున్న మూవీ లవర్స్కు తెలంగాణ ప్రభుత్వం బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు చెప్పింది.
ఆ థియేటర్లలో మాత్రమే
ఈమధ్యకాలంలో ప్యాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు.. టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు మేకర్స్. ప్రభుత్వం కూడా మేకర్స్ కోరికను అర్థం చేసుకొని ధరల పెంపుకు అనుమతి అందిస్తున్నారు. ఇప్పుడు ‘దేవర’ టికెట్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కానీ ఫ్యాన్ షోలను మాత్రం అర్థరాత్రి నుండే ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 26 అర్థరాత్రి 1 గంటకు హైదరాబాద్లోని పలు థియేటర్లలో ఈ మూవీ ఫ్యాన్ షోలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 29 థియేటర్లను కూడా ఎంపిక చేశారు. ఆ లిస్ట్ను కూడా విడుదల చేశారు.
Also Read: ఆ రోజు ‘పుష్ప 2’ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
అర్థరాత్రి నుండే
ఫ్యాన్ షోల నుండే ‘దేవర’ టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 26 అర్థరాత్రి ఏర్పాటు చేసే షోలకు టికెట్ ధర రూ.100 పెంచుకోవచ్చని తెలిపింది. అర్థరాత్రి 1 గంటకు మాత్రమే కాదు.. ‘దేవర’ విడుదలయిన మొదటి రోజు.. అంటే సెప్టెంబర్ 27న ఉదయం 4 నుండి 6 గంటల షోకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అదేరోజు తెలంగాణలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరను రూ.100 పెంచుకునే అవకాశం ఇచ్చింది. మొదటి రోజు మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు టికెట్ ధరలు రూ.50 పెరగనున్నాయి. ఆ ధరలతోనే ‘దేవర’ సినిమా చూడాల్సి ఉంటుంది ప్రేక్షకులు.
అక్కడ అలా, ఇక్కడ ఇలా
సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలు రూ.25, మల్టీప్లెక్స్లలో రూ.50 పెరగనున్నాయి. టికెట్ ధరలు పెరిగినా కూడా ‘దేవర’ను చూడడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి సిద్ధం లేరు ప్రేక్షకులు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవర’తో జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. ఇందులో విలన్గా నటించనున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘దేవర’ కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.