Tata to produce iPhones soon : టాటా అంటున్నారు.. ఐఫోన్ అంటున్నారు… వీటికి లింకేంటి? అని అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే… దేశంలో ఐఫోన్ల తయారీ ప్రారంభించనుంది… టాటా గ్రూప్. దీని కోసం.. ప్రస్తుతం ఐఫోన్లు ఉత్పత్తి చేస్తున్న విస్ట్రోన్ కంపెనీలో… మెజారిటీ వాటాల కొనుగోలుకు చర్చలు జరుపుతోంది. విస్ట్రోన్ తయారీ కేంద్రం టాటా చేతికి వస్తే… ఐఫోన్ తయారీ చేపట్టిన తొలి భారత కంపెనీగా నిలవనుంది… టాటా గ్రూప్.
ప్రస్తుతం మన దేశంలో తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ కంపెనీలు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పి… ఆపిల్ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. వీటిలో విస్ట్రోన్ కంపెనీ… ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సర్వర్ల తయారీ వంటి ఇతర విభాగాలకూ విస్తరించే ఆలోచనలో ఉంది. అందుకే భారత్లో ఆపిల్ ఉత్పత్తుల్ని తయారు చేసే ఫ్యాక్టరీని… ఆసక్తి ఉన్నవారికి అమ్మాలని చూస్తోంది. దాంతో… విస్ట్రోన్ కేంద్రంలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది… టాటా గ్రూప్. ఇరువర్గాల మధ్య చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని కూడా చెబుతున్నారు. వచ్చే మార్చి 31 నాటికి విస్ట్రోన్ టాటాల పరం కావొచ్చని ప్రచారం జరుగుతోంది. డీల్ కుదిరితే… ‘టాటా ఎలక్ట్రానిక్స్’ ఐఫోన్ల తయారీని చేపట్టనుంది.
బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో విస్ట్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. డీల్ ఖరారైతే… అందులోని 8 ఐఫోన్ తయారీ లైన్లు టాటా చేతుల్లోకి వస్తాయి. అంతే కాదు 10 వేల మంది కార్మికులు కూడా టాటా గ్రూప్ కింద పని చేస్తారు. ప్రస్తుతం హోసూర్ యూనిట్లో ఐఫోన్లో వాడే పరికరాలను తయారు చేస్తున్న టాటా… విస్ట్రోన్ యూనిట్లో ఐఫోన్ల తయారీని కూడా ప్రారంభిస్తే… ఆపిల్-టాటా మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. హోసూర్ యూనిట్లో భారీగా నియామకాలను చేపట్టిన టాటా… వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ప్లాంట్లోనే కొత్తగా ఐఫోన్ తయారీ లైన్లనూ జత చేయాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లనూ తెరవనున్న టాటా గ్రూప్… మార్చిలోగా ముంబైలో తొలి స్టోర్ను ప్రారంభించబోతోంది.
Follow this link for more updates:- Bigtv