Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు.. ఎంఎస్ ధోనీ మూవీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుశాంత్ మరణం తర్వాత.. అతని మరణానికి అనేకకారణాలున్నాయని, ప్రేమ వ్యవహారం, డ్రగ్స్ ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. అలాగే.. బాలీవుడ్ పెద్దలు అతని టాలెంట్ ను పైకి రానివ్వకుండా అడ్డుకోవడం కూడా ఒక కారణమన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడన్నది పచ్చినిజమని ఆ తర్వాత పలువురు నటీనటులు తెలిపారు.
కాగా.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అమ్మకానికి పెట్టారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు తెలుగు హీరోయిన్ ఆదా శర్మ ఇంట్రస్ట్ చూపిస్తోందని సమాచారం. కేరళ స్టోరీ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆదాశర్మ.. ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. తనకంటూ సొంతిల్లు ఉండాలనుకున్న ఆమె.. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేయనుందని తెలుస్తోంది.
ఇటీవల మీడియాకు తారసపడిన ఆదా శర్మను ఇదే విషయమై ప్రశ్నించగా.. నిజంగా నేను కొనుగోలు చేయాలనుకుంటే.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పనంది. తనకు నచ్చినపుడు, నచ్చిన రీతిలో, నచ్చిన సమయంలోనే ఈ విషయాన్ని చెబుతానని.. అప్పటి వరకూ ఎవరికి తోచినట్లు వాళ్లు రాసుకోండని చెప్పింది. దీంతో.. ఆదాశర్మ సుశాంత్ సింగ్ ఇంటిని కొంటుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.