Kanguva: ఈరోజుల్లో సౌత్ మేకర్స్ అంతా దాదాపుగా ప్యాన్ ఇండియా మార్కెట్పైనే దృష్టిపెడుతున్నారు. అందుకే స్టార్ హీరోలపై భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలనే ఒత్తిడి ఉంది. అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ‘కంగువ’ (Kanguva) అనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండడంతో ప్రతీ భాషలో తనే స్వయంగా ప్రమోషన్స్ చేయాలని సూర్య ఫిక్స్ అయ్యాడు. తాజాగా తెలుగు ప్రేక్షకులను ‘కంగువ’ను దగ్గర చేయడం కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు.
గెస్ట్ రోల్ ఎవరు?
కోలీవుడ్ నుండి ఇప్పటివరకు ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ ‘కంగువ’ రేంజ్లో భారీ బడ్జెట్తో ఇలాంటి కాన్సెప్ట్తో ప్యాన్ ఇండియా సినిమా రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని, అన్ని భాషల్లో ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని మేకర్స్ కష్టపడుతున్నారు. శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకుంది. ఫైనల్గా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. సినిమా విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో ఆలోపు ఇండియా మొత్తం కవర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. అదే సందర్భంలో ‘కంగువ’లోని గెస్ట్ రోల్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు.
Also Read: “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?
ఎవరైనా అయ్యిండొచ్చు
తాజాగా హైదరాబాద్లో ‘కంగువ’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అలాగే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. అక్కడ ఒక రిపోర్టర్.. ‘కంగువ’లో సూర్య తమ్ముడు కార్తీ గెస్ట్ రోల్ చేస్తున్నాడా అని అడిగాడు. ఈ మూవీ ట్రైలర్ చివర్లో ఒక మొహాన్ని చూపించారు. అది ఎవరు అని మాత్రం స్పష్టంగా చూపించలేదు. అయితే తను కార్తీనే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. దీంతో అది నిజంగానే కార్తీనేనా అని సూర్యకు ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు ప్రేక్షకులను ఆట్టపట్టించే సమాధానం చెప్పాడు సూర్య (Suriya). ‘‘ఇప్పుడే సర్ప్రైజ్ను చెడగొట్టడం ఎందుకు? అక్కడ ఎవరు వస్తారో చూద్దాం. అది కార్తీ అయ్యిండొచ్చు, ఇంకొకరు అయ్యిండొచ్చు. థియేటర్లోనే ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురుచూద్దాం’’ అన్నాడు.
మొదటి సినిమా
‘కంగువ’లో తన తమ్ముడు కార్తీ (Karthi) ఉన్నాడనే విషయాన్ని సూర్య నేరుగా చెప్పకపోయినా అది కచ్చితంగా కార్తీనే అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీలో సూర్యకు జోడీగా దిశా పటానీ నటించింది. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో విలన్గా నటించాడు. దిశా, బాబీ.. ఈ ఇద్దరు బాలీవుడ్ నటులకు తమిళంలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఇప్పటివరకు విడుదలయిన అప్డేట్స్ చూస్తుంటే ‘కంగువ’ ఒక టైమ్ ట్రావెలింగ్ మూవీ అయ్యిండవచ్చని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇందులో సూర్య రెండు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నాడు.