విలక్షణ నటుడు విజయ్ సేతుపతిపై ఇండియా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అసలు ఆయనపై సుప్రీం కోర్టుకి ఎందుకా కోపం.. ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే.. రెండేళ్లు ముందు బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఉన్న విజయ్ సేతుపతికి ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మక్కల్ సెల్వన్ టీమ్ సభ్యులు సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని రోజులకు మహా గాంధీ అనే వ్యక్తి .. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మనుషులు తనపై దాడి చేసే ప్రయత్నం చేశారంటూ సుప్రీం కోర్టుకి వెళ్లారు. కేసుని పరిశీలించిన కోర్టు.. విజయ్ సేతుపతిని పిలిచి చురకలు అంటించింది.
సెలబ్రిటీలుగా ఉన్న మీకు ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. అలాంటి సమయంలో మీరే సమగ్రతను, సమతుల్యతను పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మీరు కూడా నోటికి పని చెప్పి వారిలా చుట్టూ తిరుగుతుండలేరు కదా! మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు. కాబట్టి సభ్య సమాజంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ విజయ్ సేతుపతికి కోర్టు అసహనాన్ని తెలియజేసింది. ఈ కేసుకి విజయ్ సేతుపతికి సంబంధంలేదని, కాబట్టి ఆయన్ని కేసు నుంచి తప్పించాలని ఆయన తరపు లాయర్ వాదించారు. అయితే కోర్టు మాత్రం కేసుని మార్చి 2కి వాయిదా వేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఆయన నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫర్జా అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించి అలరించారు. ఇవి కాకుండా బాలీవుడ్ సినిమా మేరీ క్రిస్మస్ రిలీజ్కు రెడీగా ఉంది. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్. అలాగే ముంబైకర్, జవాన్ సినిమాలు కూడా రిలజ్కి రెడీ అవుతున్నాయి. ఇంకా అరన్మణి 4, విడుదలై, గాంధీ టాక్స్ అనే తమిళ సినిమాలు రిలీజ్ కానున్నాయి.