Devara:దేవర.. దేవర.. దేవర.. సోషల్ మీడియా అంతా దేవర నామజపం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర రేపు రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ కు పది రోజుల ముందే కటౌట్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన ఫ్యాన్స్.. ఇక ఇప్పుడు థియేటర్ మొత్తాన్ని కొత్త పెళ్లి కూతురులా అలంకరించడం మొదలుపెట్టారు.
ఇక ఫ్యాన్స్ ఉత్సాహాన్ని అలుసుగా తీసుకున్న కొన్ని థియేటర్ యాజమాన్యాలు.. టికెట్ రేట్ ను అమాంతం పెంచేసి బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇప్పటికే దేవర కు టికెట్ రేట్లు పెంచుకోమని ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు కాకుండా .. కొన్ని థియేటర్స్ లో టికెట్ ను తమకు నచ్చిన రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తహసీల్దార్ వాడకు చేరగా.. వారు కొన్ని థియేటర్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
తాజాగా నేడు ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్ లో తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. థియేటర్లో టికెట్లు రేట్లు పెంచి అమ్ముతున్నట్లు ఆరోపణలు రావడంతో వారు తనిఖీలు నిర్వహించగా.. థియేటర్ యాజమాన్యం అర్ధరాత్రి షో కు ముందుగానే అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు బయటపడింది. థియేటర్ అనుమతి, అధిక షోలకు అనుమతులు, టికెట్ల పెంపుపై అనుమతుల గురించి వారిని విచారించారు.
ఇక వాటికి థియేటర్ యాజమాన్యం సమాధానం ఇవ్వటంలో తడబడడంతో తహసీల్దార్ థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తహసీల్దార్ తనిఖీలతో మిగిలిన థియేటర్ల యాజమాన్యాలలో వణుకు మొదలయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.