Su Arun Kumar: చియాన్ విక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏ భాషలో మంచి సినిమా ఉన్నా తెలుగు ప్రేక్షకులు వెతుక్కుని మరీ చూస్తారు. ఒకప్పుడు తమిళ్ హీరోల సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ తో రిలీజ్ అయ్యేవి. అలా ఎన్నో సినిమాలు ద్వారా విక్రమ్, విశాల్, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలు తెలుగు ప్రేక్షకులుకు కూడా సుపరిచితం. ఇక విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక చియాన్ విక్రమ్ కూడా తన కెరీర్ లో ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేశారు.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి నేడు దర్శకులుగా కొనసాగుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. కొంతమంది స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసారు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి “పన్నియరం పద్మునియం” సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అరుణ్ కుమార్. విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అరుణ్ కుమార్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలో “సింధుబాద్” అనే ఒక కథను రాసి చియాన్ విక్రమ్ కి చెప్పాడు. ఆ కథ అప్పుడు విక్రమ్ కి నచ్చలేదు. ఇక రీసెంట్ గా సిద్ధార్థ హీరోగా “చిత్తా” అనే సినిమాను చేసాడు అరుణ్ కుమార్. ఈ సినిమాను స్వయంగా సిద్ధార్థ నిర్మించారు.
ఇక తెలుగులో కూడా సిద్ధార్థ కి మంచి మార్కెట్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసుగా తెలుగులో సినిమాలు చేసి అద్భుతమైన ఇమేజ్ సాధించుకున్న తర్వాత కొంత కాలం పాటు తెలుగు లో సినిమాలు చేయడానికి గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత చేసిన టక్కర్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే వాస్తవానికి చిత్తా అనే సినిమా తెలుగులో చిన్నా పేరుతో రిలీజ్ అయింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేదు.
ఇక ఈ సినిమా చూసిన తర్వాత విక్రం అరుణ్ కుమార్ కి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసారు. అప్రిషియేట్ చేయడంతో పాటు ఏదైనా కథ ఉందా అని అడిగారు. అప్పుడు అరుణ్ కుమార్ “వీరధీర సూరన్” కథను విక్రమ్ కి చెప్పారు. ఆ కథ విక్రమ్ కి విపరీతంగా నచ్చడంతో వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఆ సినిమాను చేస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అరుణ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు.