Sriya Reddy : చాలామంది హీరోయిన్లు.. తమ కెరీర్లో ఎంతో సక్సెస్ అయినా కూడా ఒక సమయం తర్వాత సడెన్గా స్క్రీన్ మీద కనిపించకుండా మాయమయిపోతారు. దీనికి ఉదాహరణగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలామంది నటీమణులు కూడా ఉన్నారు. కానీ వారిలో చాలామంది ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఒక తమిళ సీనియర్ నటి కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్తో రీ ఎంట్రీ ఇస్తోంది.
శ్రియా రెడ్డి.. ఈ పేరు వినగానే హీరోయిన్ ఎవరో చాలామంది ప్రేక్షకులకు టక్కున గుర్తురాకపోవచ్చు. ఎందుకంటే తను సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయ్యింది. తన కెరీర్ మొత్తంలో కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమాలకంటే కథాపరంగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలే ఎక్కువ. విశాల్ హీరోగా తెరకెక్కిన ‘తిమిరు’ చిత్రంలో శ్రీయా విలన్గా నటించింది. ఈ చిత్రం ‘పొగరు’ అనే టైటిల్తో తెలుగులో డబ్ అయ్యింది. ఇందులో శ్రియా నటనను ఇప్పటికీ చాలామంది లేడీ విలన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు.
దాదాపు దశాబ్దం పాటు ఇండస్ట్రీలో ఉన్నా.. శ్రియా నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇక తమిళంతో పోల్చుకుంటే తెలుగులో తను చేసిన సినిమాలు కేవలం రెండే. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సినిమాలతో రీ ఎంట్రీకి సిద్దమయ్యింది శ్రియా రెడ్డి. ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’లో శ్రియా ఒక కీలక పాత్ర పోషించింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. ఇంతలోనే పవన్ కళ్యాణ్ చిత్రంలో కూడా తను నటిస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది.
పవన్ కళ్యాణ్.. చాలాకాలం తర్వాత ఒక క్రేజీ గ్యాంగ్స్టర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘ఓజీ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇందులో తాజాగా శ్రియా రెడ్డి కూడా నటిస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. అంతే కాకుండా తన పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటోంది. దీంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక చాలాకాలం తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు శ్రియా రెడ్డి.. ఎప్పటికప్పుడు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా ఫోలోవర్స్తో పంచుకుంటోంది.