Senthil Kumar: టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంథిల్ తల్లి.. ఈరోజు ఉదయమే మృతిచెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొద్దిసేపటి క్రితమే శ్రీనగర్ కాలనీలోని స్వంత గృహంలో కన్నుమూశారు. దీంతో సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇక ఈ విషయం తెలియడంతో స్వయంభు షూటింగ్ లో ఉన్న సెంథిల్.. హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సెంథిల్ భార్య రూహీ కన్నుమూసింది. COVID-19 వచ్చినప్పటి నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అవి ఎక్కువ కావడంతోనే రూహీ మరణించినట్లు సెంథిల్ తెలిపారు.
ఇక భార్య మరణం తరువాత కొన్నిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సెంథిల్.. ఈ మధ్యనే స్వయంభు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ సమయంలోనే ఆయన తల్లి కూడా మరణించడం ఎంతో విషాదకరం. ఇక సెంథిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజమౌళి ఆస్థాన డీవోపీగా సెంథిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలకు సెంథిల్.. డీవోపీగా పనిచేశారు. ఒకే ఏడాదిలోనే సెంథిల్.. భార్యను, తల్లిని పోగొట్టుకోవడం చాలా విషాదమని, ఆయనకు దేవుడు ధైర్యాన్ని అందించాలని పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.