Pawan Kalyan: మంచి ఆలోచనను అమలులోకి తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెనుకడుగు వేయరు. నటుడు షాయాజీ షిండే.. గత ఆదివారం బిగ్ బాస్ స్టేజిమీద పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులోని మాటను చెప్పాలి అని చెప్పిన విషయం తెల్సిందే. తన అమ్మ జ్ఞాపకంగా ఆమె బరువు ఉన్న విత్తనాలను దేశమంతటా నాటుతానని.. ఆ పెరిగిన మొక్కల్లో తన తల్లిని చూసుకుంటానని షాయాజీ షిండే చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా పంచి ఇస్తే బావుంటుందని, దానివలన పచ్చదనం పెరుగుతుందని.. నా ఈ ఆలోచనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక దీనికి నాగార్జున సైతం.. దానికి పవన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ.. వారే ఈ విషయాన్ని ఆయన వద్దకు తీసుకువెళ్తారని చెప్పాడు.
ఇక అనుకున్నట్లే.. ఈ వీడియోను ఫ్యాన్స్ వైరల్ చేసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా షాయాజీ షిండే.. ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ షాయాజీ షిండే, పవన్ కళ్యాణ్ ను కలిశాడు.
అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్, షాయాజీ షిండే ఆలోచనలను వినడం జరిగింది. ఖచ్చితంగా షాయాజీ షిండే ఆలోచనను కార్యరూపం దాల్చేలా చేస్తామని ఆహ్వానం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే షాయాజీ షిండే ఆలోచనను పవన్ అమలులోకి తీసుకురానున్నారని సమాచారం. మరి ఈ విషయమై పవన్ మీడియా ముందు అధికారికంగా చెప్తారా.. ? లేక ఈ కార్యక్రమానికి షాయాజీ షిండేనే కర్తగా నియమిస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది.