Couple Friendly: యంగ్ హీరో సంతోష్ శోభన్.. చాలాకాలంగా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నా కూడా సంతోష్ కు గట్టి సినిమా పడలేదు. గతేడాది అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా అశ్విన్ చంద్రశేఖర్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆమె దేవకీ వాసునందన అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
నేడు ఈ హీరో పుట్టినరోజు కావడంతో.. టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సంతోష్ శోభన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ గ్లింప్స్ లో సంతోష్ శోభన్ ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించాడు. డాబా పైన పడుకొని లేవడం, కిందకు వచ్చి కిచెన్ లో దోసలు తినడం చూపించారు. ఇక చివర్లో రెండు టీలను ఇద్దరు పట్టుకొని ఉన్నప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను రివీల్ చేస్తూ సంతోష్ శోభన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇకపోతే యూవీలో మూడోసారి నటిస్తున్న హీరోగా సంతోష్ కు గుర్తింపు దక్కింది. ఇప్పటికే యూవీలోనే ఏక్ మినీ కథ, కళ్యాణం కమనీయం లాంటి సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అంటున్నాడు. యూవీలో ముచ్చటగా మూడోసారి ఆఫర్ పట్టాడంటే.. అదృష్టమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్ మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.