Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు సల్మాన్ ఖాన్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్(Gabbar Singh) ఒరిజినల్ హీరో కూడా సల్మాన్ ఖాన్. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా వెతుక్కుని మరీ చూస్తారు. అలా పరభాష నటుల గురించి కూడా తెలుగు ప్రేక్షకులు తెలుసుకున్నారు. అలానే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే మంచి ఆదరణ కూడా చూపిస్తారు.
ఇక గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్ ఈ రెండు పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేవలం రోజుల నుంచే కాదు సంవత్సరాలనుంచి కూడా వినిపిస్తున్నాయని చెప్పాలి. అసలు జరిగిన విషయం ఏంటంటే 1998లో సల్మాన్ ఖాన్ నటించిన “హం సాథ్ సాథ్ హై” (Hum Saath – Saath Hain) అనే సినిమా షూటింగ్లో భాగంగా రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడారు. ఆ కేసు అప్పుడు పెను సంచలనంగా మారింది. ఐదేళ్లపాటు జైల్లో కూడా ఉన్నారు సల్మాన్. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చినా కూడా ఆ కేసు ఇప్పటికీ వెంటాడుతూ ఉంది.
ఇక ఈ ఇష్యూ కి లారెన్స్ కి సంబంధం ఏంటంటే. “బిష్ణోయ్” వర్గానికి చెందినవారు కృష్ణ జింకలను చాలా పవిత్రంగా చూస్తారు. 15వ శతాబ్దంలో గురు జంభేశ్వర్ ఈ వర్గాన్ని స్థాపించారు. తను చనిపోవడానికి అంటే ముందు కృష్ణ జింకల్ని తన పునర్జన్మగా భావించాలని చెప్పారట. అప్పటినుంచి బిష్ణోయి జింకలను ప్రేమగా చూసుకుంటారు. సల్మాన్ ఖాన్ ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు లారెన్స్ వయసు కేవలం ఐదేళ్లు. తాను పెద్దయ్యాక సల్మాన్ మీద కోపం పెంచుకోవడంతో పాటు చంపేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు అదే ఇష్యూ పెను సంచలనంగా మారుతుంది.
ఇక తాజాగా సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. గ్యాంగ్స్టర్స్ కు పెట్టింది పేరు ముంబై, కొంత కాలం పాటు ముంబైని దావూద్ ఇబ్రహీం పాలించాడు. ప్రస్తుతం దావూద్ ఎక్కడో పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. మళ్లీ ఆ రేంజ్ లో లారెన్స్ బిష్ణోయ్ ఎదగడమే తన ఉద్దేశం అని కొంతమంది భావిస్తున్నారు.