Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా కన్నా వ్యక్తిగతంగా అతనిలో ఎక్కువ చిన్న మామ పవన్ కళ్యాణ్ భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఆపద అన్నవారికి సాయం చేయాలనే పెద్ద మామ చిరంజీవి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
మెగా కుటుంబానికి తేజ్.. ఒక కవచంలా మారాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే తేజ్ కు ఎంత ఇష్టమో అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. తేజ్ కు యాక్సిడెంట్ అయినప్పుడు పవన్ సైతం ఎంతో బాధపడ్డాడు. ఇక వీరి బాండింగ్ ఎలాంటింది అనేది పవన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు తేజ్ చేసిన రచ్చలోనే కనిపించింది. పవన్ ను ఎత్తుకొని.. తన ఆనందాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా మెగా కుటుంబం పవన్ కు ఇచ్చిన వెల్ కమ్ ఈవెంట్ లో కూడా తేజ్ దే హంగామా అంతా.
ఇక తాజాగా మరోసారి పవన్ పై మెగా మేనల్లుడుకు ఉన్న ప్రేమ బయటపడింది. ఎన్నికల్లో కనుక పవన్ గెలిస్తే.. తిరుమల వచ్చి కాలినడకన స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడట తేజ్. నేడు ఆ మొక్కును తీర్చుకోవడానికి ఈ హీరో తిరుమల వెళ్ళాడు. నేటి ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని తేజ్ దర్శించుకున్నాడు. అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్లి మరీ స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇప్పటివరకు తేజ్.. ఇలాంటి ఒక సాహసం చేయలేదనే చెప్పాలి. ప్రమాదం నుంచి బయటపడినప్పుడు కూడా స్వామివారిని దర్శించుకున్నాడు కానీ, ఇలా కాలినడకన వెళ్ళలేదు. ఇప్పుడు మామ గెలుపును భారీగా ఇచ్చిన దేవుడికి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా అనుకున్నాడో ఏమో ఇదుగో ఇలా ఎంతకష్టమైన తట్టుకొని నడిచి స్వామి సేవలో పాల్గొన్నాడు. సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తేజ్ ఒక సినిమాతో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.