Sai Dharam Tej.. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురించి, ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ.. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు (Mahesh Babu) బాటలో నడిచి అందరిని ఆశ్చర్యపరిచారు సాయిధరమ్ తేజ్. అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రేంజ్ లో కాకపోయినా ఏదో ఉడతా భక్తి లాగా తన వంతు సహాయం అందించి మంచి మనసు చాటుకున్నారు.
చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించిన హీరో..
అసలు విషయంలోకి వెళితే.. తాజాగా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ను ఫ్యామిలీతో కలిసి సందర్శించిన సాయి ధరమ్ తేజ్ చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈయన చిన్నారులలో హృదయ స్పందన సమస్యలకు చికిత్స అందించేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సంస్థకు తన వంతుగా 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు సాయి ధరంతేజ్.. ఇక మనమంతా కలిసి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టిద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు అక్కడ పిల్లలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
హీరో పై వైద్యులు ప్రశంసలు..
ఇక ఆయన మంచి మనసును రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు అలాగే ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసిస్తూ పొగడ్తల వర్షంతో ముంచేత్తారు. మరొకవైపు సాయిధరమ్ తేజ్ చేసిన ఈ మంచి పనికి అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సామాజిక సేవ కార్యక్రమాలలో బిజీగా మారిన సాయి ధరంతేజ్..
నిజానికి సాయి ధరంతేజ్ కి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకోవడానికి తన వంతుగా 20 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. దీంతోపాటు విజయవాడలో పర్యటించి అమ్మ అనాధాశ్రమానికి రూ .2లక్షలు , ఇతర సేవా సంస్థలకు మరో 3 లక్షల రూపాయలను ఆయన అందించారు. అంతేకాదు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ సినిమాలు..
ఇక సాయి ధరంతేజ్ విషయానికి వస్తే.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ కమర్షియల్ హీరోగా స్థిరపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత ఈయన నటించిన చిత్రం బ్రో. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత నటించిన విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సాయి ధరంతేజ్.