S.P.Bala Subrahmanyam : సంగీత ప్రపంచంలో ఎంతో మంది శ్రోతలను అలరించి, తన అద్భుతమైన గాత్రంతో ఎంతో మందిని మెప్పించిన దివంగత మ్యూజిక్ డైరెక్టర్, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP.Bala Subrahmanyam) నేడు మన మధ్య లేకపోయినా ఆయన పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషలతో పాటు దాదాపుగా 16 భాషలలో వేలాది పాటలు పాడి ఎన్నో రికార్డులను సైతం అందుకున్నారు. అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రియులను అలరించిన ఈయన స్వర్గస్తులై నాలుగేళ్లు అయిపోయింది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా స్వర్గస్తులైపోయారు బాలసుబ్రమణ్యం.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి అరుదైన గౌరవం..
ఇదిలా ఉండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి తమిళనాడు ప్రభుత్వం మరో గౌరవాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలని విజ్ఞప్తి చేయగా.. ఆయనకు ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగానే, ఇలా పేరు పెడితే ఆయనకు ఇచ్చే గౌరవం అవుతుందని కోరారట. ఇక ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నుంగంబాక్కం లోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్ర వ్యక్తికి చెన్నైలో గౌరవం..
ఇక ఈ రోజు నుంచి కాందార్ నగర్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ సుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలి అని సీఎం మీడియా వేదికగా ప్రకటించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్టాలిన్ నిర్ణయం పట్ల సంగీత ప్రియులు, ఎస్పీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ చెన్నైలో ఇలాంటి గౌరవం లభించడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెరియర్..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఈయన.. ఇంజనీరింగ్ పూర్తి చేసి సంగీతం పట్ల అభిరుచి తో గాయకుడిగా కెరియర్ మొదలుపెట్టారు. ఎస్పీ కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఈయన తెలుగుతో పాటు దాదాపు ఎన్నో భాషలలో వేలాది పాటలు పాడి అంతకుమించి రికార్డులను సొంతం చేసుకున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో పాటల కాంపిటీషన్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఎంతో మంది బాల గాయకులను తీర్చిదిద్దిన ఘనత ఈయన సొంతం. ముఖ్యంగా పాడుతా తీయగా కార్యక్రమం ఎంత గొప్ప సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాడుతా తీయగా పేరు చెప్పగానే అందరికీ ప్రధమంగా గుర్తొచ్చే పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఇక ఆయన మరణాంతరం ఆయన వారసుడు ఎస్పీ చరణ్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఎస్పీ చరణ్ కూడా మంచి సింగర్.. ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.