Indian Idol 13 : దేశంలో ఇండియన్ ఐడల్ షోకి ఎంతో క్రేజ్ ఉంది. ఈ షోలో విజేత నిలిచే సింగర్ స్టార్ డమ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఇండియన్ ఐడల్ -13 సీజన్ పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠకు తెరపడింది. 13వ సీజన్ ఇండియన్ ఐడల్ ట్రోఫీని అయోధ్య యువకుడు రిషి సింగ్ కైవసం చేసుకున్నాడు.
హిందీలో ప్రసారమయ్యే ఈ రియాల్టీ షో తాజా సీజన్ ఫైనల్ వేడుక ముంబైలో సందడిగా సాగింది. ఈ షోకు నేహా కక్కర్, హిమేశ్ రేషమియా, విశాల్ దద్లానీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆరుగురు గాయకులు ట్రోఫి కోసం పోటీ పడ్డారు. మధురమైన మెలోడీలతో మెప్పించారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్తో హోరెత్తించారు. ప్రేక్షకులతోపాటు , న్యాయనిర్ణేతలను తన గాత్రంతో మంత్రముగ్ధులను చేసిన రిషి సింగ్ చివరకు విజేతగా నిలిచాడు. అతడికి ఇండియన్ ఐడల్ ట్రోఫీ, కారు, రూ.25 లక్షల నగదు బహుమతిని అందించారు. ఇండియన్ ఐడల్ -13 ట్రోఫీని గెలుపొందానంటే తాను నమ్మలేకపోతున్నానని రిషి సింగ్ అన్నాడు. తన కల నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించిన రిషికి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎంతో ఇష్టం. దేవాలయాలు, గురుద్వారాల్లో పాటలు పాడుతూ ముందుకు సాగాడు. అలా సింగర్ గా కెరీర్ ను ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై తొలుత కుటుంబసభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రిషి ఆసక్తి, పట్టుదలను గమనించి చివరకు అండగా నిలిచారు. రాజేంద్ర సింగ్, అంజలి సింగ్ దంపతులు చిన్నప్పుడే రిషిని దత్తత తీసుకున్నారు. రిషి ఈ విషయాన్ని ఈ షోలోనే వెల్లడించాడు.
కోల్కతాకు చెందిన దెబోస్మితా రాయ్ ఫస్ట్ రన్నర్గా నిలిచింది. ఆమెకు ట్రోఫీతోపాటు రూ.5 లక్షల చెక్ అందుకుంది. చిరాగ్ కొత్వాల్ రెండో రన్నరప్గా నిలిచాడు.
ఇండియన్ ఐడల్ షోలో తెలుగు సింగర్స్ సత్తా చాటారు. మొత్తం 13 సీజన్లలో రెండు టైటిల్స్ తెలుగు గాయకులకే దక్కాయి. 5వ సీజన్ లో శ్రీరామచంద్ర, 9వ సీజన్ లో రేవంత్ విజేతలుగా నిలిచారు. రెండో సీజన్ లో సింగర్ కారుణ్య రెండోస్థానంలో నిలిచాడు.