Renu Desai Instagram Post : రేణు దేశాయ్ యాక్టర్ గా కంటే కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా బాగా ఫేమస్. బద్రి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రేణు మొదటి మూవీ తోటే మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ తర్వాత పవన్ ప్రేమలో పడి ఇంక ఏ చిత్రాల్లోనూ నటించలేదు. బద్రి తర్వాత ఆమె చేసిన ఒకే ఒక చిత్రం జానీ అది కూడా పవన్ తోటే చేసింది. చాలాకాలం సహజీవనం సాగించిన ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అయితే తర్వాత మనస్పర్ధల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు.
ఇక పవన్, రేణు ఇద్దరు పిల్లలు తల్లి వద్దనే ఉంటున్నారు. పిల్లల కోసం రేణు దేశాయ్ ఒంటరిగా మిగిలిపోయింది అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తరువాత రీసెంట్గా దసరాకు విడుదలైన మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడ లాడించిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది. ఈ చిత్రంలో రేణు హేమలత లవణం అనే సంఘసంస్కర్త పాత్రను పోషించారు.
ఆమె స్క్రీన్ పైన కనిపించింది కాస్త సమయమే అయినప్పటికీ తన నటనతో తిరిగి ప్రేక్షకులను మెప్పించింది రేణు. అలాగే ఇటువంటి పాత్రలు చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇకపై సినిమాలలో ఛాన్స్ వస్తే ఇలాంటి పాత్రలు చేయడానికి సిద్ధమే అని తెలిపింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఫుల్ వైరల్ అయింది. ఒక్కొక్కరు 100 రూపాయలు ఇచ్చినా చాలు ఎంతో హెల్ప్ అవుతుంది అని రేణు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అయ్యో పాపం రేణు దేశాయ్ కి ఏమైంది విరాళాలు అడుగుతుంది అని బాధపడుతున్నారా.. అసలు సంగతేమిటంటే రేణు దేశాయ్ సహజంగా ఒక పెట్ లవర్. జంతువులను ఎంతగానో ప్రేమించే రేణు కుక్కల తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా ఆమె తట్టుకోలేదట. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం రేణు పలు సందర్భాలలో విరాళాలు కూడా ఇచ్చారు. తాజాగా మూడు కుక్కల ఆపరేషన్ నిమిత్తం ఓ సంస్థ విరాళాలు సేకరిస్తోంది.
ఆ మూడు కుక్కల ఆపరేషన్ కు సుమారు 55 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. ఇది తెలిసిన వెంటనే రేణు 30 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమను మరొకసారి చాటుకుంది. ఇదే విషయాన్ని పోస్ట్ ద్వారా తెలియపరుస్తూ అందరిని తమకు తోచిన సాయం చేయవలసిందిగా రేణు కోరారు. అదిగో ఆ పోస్టులోనే “నేను 30 వేలు ఇచ్చాను దయచేసి ఎవరైనా మిగిలిన డబ్బులు పంపించండి. ఒక్కొక్కరు కనీసం వంద రూపాయలు ఇచ్చినా చాలా హెల్ప్ అవుతుంది “అని రాసుకొచ్చారు. ప్రస్తుతం రేణు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఈ స్టోరీ పోస్ట్ బాగా వైరల్ అయింది.