Renu Desai (Latest tollywood Updates ): స్టువర్టుపురం దొంగల ముఠాకు సంబంధించిన టైగర్ నాగేశ్వరరావు…ఒకప్పుడు స్టువర్టుపురాన్నే కాదు దేశాన్నే వణికించిన పేరు. టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను ఆధారంగా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ నిన్న విడుదల అయింది. మంచి పవర్ఫుల్ కం బ్యాక్ తో మాస్ మహారాజ్ వస్తున్నాడు అని చెబుతున్న ఈ ట్రైలర్లో అందరినీ ఆకర్షించిన మరొక విషయం రేణు దేశాయ్.
ఈ మూవీలో రేణు దేశాయ్ నటిస్తున్న పాత్ర పేరు హేమలత లవణం. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఎవరు అన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది. అసలు హేమలత లవణం ఎవరు.. ఆమెకు స్టువర్టుపురానికి సంబంధం ఏమిటి.. అనే విషయాలను తెలుసుకుందాం పదండి. హేమలత లవణం మరెవరో కాదు…స్వయాన తెలుగు కవి గుర్రం జాషువా గారి కుమార్తె.
మద్రాసు క్వీన్స్ కళాశాలలో బిఏ డిగ్రీ ను పూర్తిచేసి బంగారు పతకాన్ని సాధించిన హేమలత లవణం.. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తండ్రి లాగానే సమాజ సేవ కోసం, అట్టడుగు జాతి అభివృద్ధి కోసం ఎంతో పాటు పడ్డారు. తనలాగే ప్రజాస్వామ్యం ,నాస్తికత్వం ,గాంధీయవాదం పై గౌరవం ఉన్న గోపరాజు లవణం ను ఆమె వర్ణ భేదాలను అతిక్రమించి వివాహం చేసుకున్నారు.
మరి ఇటువంటి సంఘ కర్తకు…దొంగలకు అడ్డా అయిన స్టువర్టు పురానికి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? దొంగల కోటగా పేరు పడిన స్టువర్టుపురంలో మార్పుకు శ్రీకారం చుట్టిన మహా నాయకురాలు హేమలత లవణం. ఒకప్పటి నేరాల అడ్డ ఇప్పుడు నేర రహిత ప్రదేశంగా మారడం వెనుక ఆమె చేసిన కృషి ఎంతో ఉంది. అంతేకాదు వినోబాభావే నేతృత్వంలో బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తేవడం కోసం హేమలత లవణం,భూదాన యాత్రలో ఆయనతో పాటు చంబల్ లోయలో కృషి చేశారు.
అయితే అందరూ చేసిన పనులు చరిత్రలో నిలుస్తాయి కానీ అందరికీ గుర్తు ఉంటాయి అన్న గ్యారెంటీ లేదు కదా…. అలా చరిత్రకు ఎక్కినా కనుమరుగు అయిన చరిత్ర ఈమెది.
ఇప్పటి వారికి తెలియకపోవచ్చు…కానీ ఒకప్పుడు గుంటూరు జిల్లా బాపట్ల కు సమీపంలో ఉన్నటువంటి స్టువర్టుపురం ప్రదేశం పేరు చెబితే అందరూ ఉలిక్కిపడేవారు. అయితే అక్కడ కరుడు కట్టిన దొంగలే కాదు అభాగ్య జీవులు కూడా ఎందరో ఉన్నారు. కోస్తా జిల్లాలలో ఎక్కడ దొంగతనం జరిగిన ముందుగా పోలీసులు వీళ్లను అనుమానించడమే కాకుండా ..అమాయకులను పట్టుకెళ్ళి చావబాదిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఒకసారి విచారణకు వెళ్లిన ఎస్పీని అక్కడి ఆడవారు నిలదీసి ,ఎదురు తిరిగారు. ఎలాగైనా అక్కడ మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో విజయవాడ నాస్తిక కేంద్రానికి వెళ్లిన ఎస్పీ.. సాంఘిక సంస్కర్తలుగా గొప్ప పేరు గడించిన గోపరాజు రామచంద్రారావు దంపతులను స్టువర్టుపురంలో మార్పు తీసుకు రమ్మని కోరారు.
అయితే తలుపు వెనక నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న ఒక యువతి నేను వస్తాను అక్కడ నేరస్తులను నేను మారుస్తాను అని ముందుకు వచ్చి స్పందించింది. ఆమె మరెవరో కాదు డాక్టర్ హేమలత లవణం…అలా ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమానికి ఆమె నాంది పలికింది. ఆమె చేపట్టిన ఎన్నో సంస్కరణల కారణంగా స్టువర్టుపురంలో చైతన్యం వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఆమె పాత్రలోని రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు.