Non Bailable Warrant on Actress Jayaprada(Tollywood celebrity news): ఒకప్పుడు అందాలతారగా అలరించిన ప్రముఖ సినీనటి.. మాజీ ఎంపీ జయప్రదను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో పలుమార్లు వాయిదాలకు హాజరుకాకపోవడంతో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తక్షణం జయప్రదను కోర్టు ముంగిట హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ తరఫున రాంపూర్ నియోజకవర్గ ఎంపీగా జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అప్పట్లో ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణలో భాగంగా అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ.. జయప్రద నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ట్ జారీ చేసింది కోర్టు.
గతేడాది నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆతర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరుకాలేదు. డిసెంబర్ లో హాజరు కావాలని జయప్రదకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా ఆమె లెక్క చేయక పోవడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కానీ, ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలంటూ కోర్టు మళ్ళీ ఆదేశాలు చేస్తూ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
జయప్రద కోసం పోలీసులు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
తెలుగువారికి సుపరిచిత నటి అయిన జయప్రద తెలుగుతోపాటు దేశంలోని ఇతర భాషల చిత్రాల్లోనూ నటించారు. ఆమె 300కుపైగా చిత్రాల్లో నటించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రద. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి.. రాంపూర్ లోక్సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపూర్ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు. రాంపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కేసులో జయప్రదకు జైలుశిక్ష కూడా పడింది. మళ్లీ ఇప్పుడు ఈసీ కేసు పీకలకు చుట్టుకోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు.