Ram charan : హీరో రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించాడు. చెర్రీ ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు . భారతీయ సినిమా పరిశ్రమ తరఫున ప్రతినిధిగా హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సదస్సులో రామ్ చరణ్ స్పీచ్కు అంతా ఫిదా అయ్యారు.
ఇండియాలో బ్యూటీఫుల్ లొకేషన్లు ఉన్నాయని రామ్ చరణ్ తెలిపాడు. కశ్మీర్ లో ఈ సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నాడు. కేరళ, కశ్మీర్ ఇలా ఎన్నో ప్రాంతాల్లో ప్రకృతి ఎంతో బాగుంటుందని వివరించాడు. ఇలాంటి లోకేషన్లు షూటింగ్కు ఎంతో బాగుంటాయన్నాడు. తాను ఈ ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నానని తెలిపాడు.
తాను నటించే సినిమాల షూటింగ్ ఎక్కువ శాతం ఇండియాలోనే చేయాలని భావిస్తున్నానని చెప్పాడు. కేవలం లోకేషన్ల కోసమే ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశాడు. తాను హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. ఆ డైరెక్టర్లకు భారత్ కు రమ్మని కండీషన్ పెడతానన్నాడు. నార్త్, సౌత్ అని రెండు రకాల సినిమాలు లేవని.. భారతీయ సినిమా ఒక్కటేనని రామ్ చరణ్ స్పష్టం చేశాడు.
ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్లో ఎంతో ఆదరించారని రామ్ చరణ్ తెలిపాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ప్రజల ఎంతో ఆత్మీయంగా ఆదరించారని తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన భార్య ఉపాసనకు జపాన్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ప్రస్తుతం తన భార్య ఏడో నెల గర్భవతి అని ఇప్పుడు జపాన్ టూర్ వెళ్దామన్నా వెంటనే ఓకే అంటుందని చెర్రీ చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చిన్న వయస్సులో తండ్రితో కలిసి కాశ్మీర్కు మొదటిసారి వచ్చానని తెలిపాడు. 68 ఏళ్ల వయస్సులోనూ సినిమాలతో చిరు బిజీగా ఉన్నారని చెప్పాడు. ఉదయం 5.30 గంటలకు నిద్రలేచి పనిలో మునిగిపోతారని తెలిపాడు. తండ్రే తనకు స్ఫూర్తి అని చెర్రీ అన్నాడు.
సోమవారం జీ -20 సదస్సు ప్రారంభమైంది. 3రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 17 దేశాల నుంచి ఫిలింటూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణపై చర్చలు జరుతున్నారు. ఇండియా నుంచి రామ్ చరణ్ పాల్గొన్నాడు. దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె. బోక్తో కలిసి చరణ్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసి అలరించాడు.