Rajamouli News : ప్రతీ భాషలో సినీ పరిశ్రమకు గుర్తింపు తీసుకొచ్చిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కొంతమంది ఉంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు అంటే కొన్ని పేర్లు ముందుకు వస్తాయి. అందులో ఈతరం వారికి ముందుగా గుర్తొచ్చే పేరు రాజమౌళి. అసలు తెలుగు సినిమా అనేది తక్కువ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడానికి మాత్రమే ఉంది అని విమర్శించే వారికి ఈ దర్శక ధీరుడు గట్టి సమాధానమే ఇచ్చాడు. అందుకే రాజమౌళికి దక్కిన రివార్డుల్లో మరొకటి యాడ్ అయ్యింది.
‘బాహుబలి’ అనే చిత్రం తెలుగు సినిమాను చూసే దృష్టినే మార్చేసింది. ఒక మామూలు తెలుగు సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కింది. అందుకే బాహూబలి షూటింగ్ జరుగుతున్న కాలంలో రాజమౌళిని చాలామంది విమర్శించారు కూడా. ఆ విమర్శలు అన్నింటిని ఈ సినిమా సక్సెస్ తిప్పికొట్టింది. అంతే కాకుండా ఒక సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వడమే కష్టం అనుకుంటున్న సమయంలో రెండో పార్ట్తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు రాజమౌళి.
బాహూబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించే చిత్రం కోసం కేవలం తన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులు వేస్ట్ అవ్వకుండా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మరో ఎపిక్ను వారి కళ్ల ముందు పెట్టాడు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో ఇండియాకు ఆస్కార్ను కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు సినిమాలతో పాటు క్రికెట్ను కూడా తన సొంతం అనుకోనున్నాడు రాజమౌళి. ఎందుకంటే తాజాగా తనను ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ) ఛైర్మన్గా ఎంపిక చేశారు.
ఇండియాలో ఉన్న ఎన్నో స్కూల్స్ లో ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉంటారు. అలా క్రికెట్నే తమ ప్రొఫెషన్గా మార్చుకోవాలి అనుకునే విద్యార్థులకు ఐఎస్బీసీ సాయం చేస్తుంటుంది. అలాంటి ఓ గొప్ప సంస్థకు రాజమౌళి ఛైర్మన్గా ఎంపిక అవ్వడం సంతోషం ఉందంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ కొత్త పదవి కోసం రాజమౌళి సిద్ధమవుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పుడు క్రికెట్ రంగంలోకి దిగి విద్యార్థులకు తన సహాయాన్ని అందిస్తారని అందరూ ఆశిస్తున్నారు.