Rajamouli: ఒకరు హాలీవుడ్ దిగ్గజం. ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్. ఇద్దరు హేమాహేమీలు ఒక్కచోట కలిశారు. హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ ను మన జక్కన్న రాజమౌళి మీట్ అయ్యారు. ‘ఐ జస్ట్ మెట్ గాడ్’ అంటూ ఆ అరుదైన సందర్భాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. వారిద్దరూ కలిసిన ఫోటోలను షేర్ చేశారు.
‘‘గాడ్ ఆఫ్ మూవీస్గా అభివర్ణించే స్పిల్బర్గ్ను కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. ‘నాటు నాటు’ ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటల్ని నేనింకా నమ్మలేకపోతున్నా’’ అంటూ కీరవాణి సైతం ట్వీట్ చేశారు.
ఆస్కార్(Oscars) ఓటింగ్లో భాగంగా లాస్ ఏంజెల్స్ లో జరిగిన యూనివర్సల్ పార్టీకి రాజమౌళి, కీరవాణిలు హాజరయ్యారు. హాలీవుడ్కు చెందిన స్టార్ సెలబ్రిటీలు అనేకమంది విచ్చేశారు. ఆ పార్టీలో హాలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ అనదగిన స్టీవెన్ స్పిల్బర్గ్ను కలిసి కాసేపు మాట్లాడారు. ‘జురాసిక్ పార్క్’, ‘హుక్’, ‘ది టర్మినల్’, ‘ది పోస్ట్’ వంటి సినిమాలకు స్పిల్బర్గ్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు సాంగ్.. ఇప్పుడు ఆస్కార్ వేటలో పడింది. ఆర్ఆర్ఆర్, కాంతారా, కశ్మీర్ ఫైల్స్.. ఇలా భారత్ నుంచి ఈ ఏడాది 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్నాయి. వరల్డ్ వైడ్ గా వచ్చిన ఎంట్రీలన్నిటికీ ఓటింగ్ నిర్వహించి.. నామినేషన్స్లో నిలిచిన చిత్రాలను ఈనెల 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈసారి ఇండియన్ సినిమాకు ఆస్కార్ వరించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.