Raayan Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్న చిత్రాల్లో రాయన్ ఒకటి. ఈ సినిమాకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఇది ధనుష్ 50 వ సినిమా కావడం, రెండు ఈ సినిమాకు ధనుషే కథను అందించి, దర్శకత్వం వహించడం. ఈ రెండు కారణాల వలన రాయన్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ధనుష్ కాకుండా రాయన్ లో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ధనుష్ సీరియస్ లుక్ ఆకట్టుకొంటుంది.
ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. దుషార విజయన్.. రక్తంతో నిండిన ధనుష్ పై నీళ్లు పోస్తూ కనిపించగా.. ఆ రక్తం నీళ్లలో కలిసి కాలువలో పారుతున్న సీన్ తో ట్రైలర్ మొదలయ్యింది. అడివిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా అని సెల్వ రాఘవన్ డైలాగ్ తో కథను వివరించారు. ప్రమాదకరమైన జంతువులు సింహం, పులి ఉన్నా.. వాటికన్నా ప్రమాదకరమైన జంతువు తోడేలు అని చెప్పి.. సూర్యను చూపించారు. అంటే.. ధనుష్ సింహం, సందీప్ కిషన్ పులి అయితే.. తోడేలు సూర్య అని చెప్పకనే చెప్పుకొచ్చారు.
ఇక కథను ఎక్కువగా రివీల్ చేయకుండా.. సూర్యకు, ధనుష్ కు మధ్య వైరం.. ఒకరికోసం ఒకరు వెతుకులాట, రాయన్ అందరిని చంపడం చూపించారు. సూర్య.. రాయన్ ను ఉద్దేశించి.. వాడేమైనా మగాడా.. అయితే రమ్మను అని అనగానే సెల్వరాఘవన్ రాయన్.. బ్రహ్మా రాక్షసుడులా వస్తాడు.. దహనం చేస్తాడు అని చెప్పే ఎలివేషన్ డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి కథలో దమ్ము ఉందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. సందీప్ కు జంటగా అపర్ణ బాల మురళి నటిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా జూలై 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.